కొళ్ళుపల్లె ఘటన కేసుల్లో 81 మందికి బెయిల్‌ మంజూరు

ABN , First Publish Date - 2022-12-31T00:12:37+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆగస్టు 24న రామకుప్పం మండలం కొళ్ళుపల్లెలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో 81మంది టీడీపీ నేతలు, కార్యకర్తలకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా శుక్రవారం రామకుప్పం పోలీసుస్టేషనులో బెయిల్‌ తీసుకున్నారు.

కొళ్ళుపల్లె ఘటన కేసుల్లో 81 మందికి బెయిల్‌ మంజూరు
రామకుప్పం పోలీసుస్టేషను ఎదుట మీడియాతో మాట్లాడుతున్న మనోహర్‌ తదితరులు

రామకుప్పం, డిసెంబరు 30: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆగస్టు 24న రామకుప్పం మండలం కొళ్ళుపల్లెలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి మూడు కేసుల్లో 81మంది టీడీపీ నేతలు, కార్యకర్తలకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా శుక్రవారం రామకుప్పం పోలీసుస్టేషనులో బెయిల్‌ తీసుకున్నారు. చంద్రబాబు పర్యటన ఉందని తెలిసీ కొళ్ళుపల్లె వైసీపీ నేతలు తమ పార్టీ బ్యానర్లు, తోరణాలు కట్టి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ జరిగి పరస్పరం రాళ్ళ దాడి చేసుకున్నారు. దీనికి సంబందించి రాళ్ళబూదుగూరు ఎస్‌ఐ మునస్వామి, కొళ్ళుపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్తలు గణేష్‌, సురేష్‌రెడ్డి ఫిర్యాదులతో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పం, కుప్పం జడ్పీటీసీ మాజీ సభ్యులు మునస్వామి, రాజ్‌కుమార్‌ సహా 88మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. అప్పట్లో గౌనివారిశ్రీనివాసులు, మునస్వామి, రాజ్‌కుమార్‌ సహా 8మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారు నెల రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. మిగిలిన వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి స్టేషన్‌బెయిల్‌ మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో కేసుల్లోని 81మంది నేతలు, కార్యకర్తలు రామకుప్పం పోలీసుస్టేషనుకు చేరుకుని బెయిల్‌ పొందారు.

Updated Date - 2022-12-31T00:12:38+05:30 IST