వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల సర్దుబాటు
ABN , First Publish Date - 2022-03-16T06:07:18+05:30 IST
కొత్త జిల్లాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులను సర్దుబాటు చేశారు.
చిత్తూరు డీఎంహెచ్వోగా పెంచలయ్య.. శ్రీబాలాజీ జిల్లాకు శ్రీహరి?
చిత్తూరు రూరల్, మార్చి 15: కొత్త జిల్లాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో డీఎంహెచ్వో నుంచి స్వీపర్ కేడర్ వరకు 38 విభాగాల్లో 80 మంది ఉద్యోగులను సర్దుబాటు చేశారు. వీరిలో చిత్తూరు జిల్లాకు 53 మందిని, బాలాజీ జిల్లాకు 27 మందిని కేటాయించారు. అన్నమయ్య జిల్లాకు ఎవరినీ కేటాయించలేదు. జిల్లా లెప్రసీ కార్యాలయంలో, అడిషనల్ డీఎంహెచ్వో (ఎయిడ్స్) కార్యాలయంలో 42 మందికిగాను చిత్తూరు జిల్లాకు 20, బాలాజీ జిల్లాకు 17, అన్నమయ్య జిల్లాకు ఐదుగురిని కేటాయించారు. బాలాజీ జిల్లాకు అడిషనల్ డీఎంహెచ్వోతో పాటు మరో 16 మంది ఉద్యోగులు అక్కడే కొనసాగనున్నారు. టీబీ విభాగంలో పది మందిని.. చిత్తూరుకు 5, బాలాజీ జిల్లాకు ముగ్గురు, అన్నమయ్య జిల్లాకు ఇద్దరిని కేటాయించారు. జిల్లా టీబీ నివారణ అధికారి మాత్రం చిత్తూరు జిల్లాకే కేటాయించారు. మలేరియా విభాగంలో 42 మంది ఉద్యోగుల్లో 24 మందిని చిత్తూరుకు, 14 మందిని బాలాజీ జిల్లాకు, నలుగురిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. పీవోడీటీ విభాగంలో పీవోడీటీ సహా నలుగురినీ చిత్తూరు జిల్లాకే కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక, డీఎంహెచ్వోలకు సంబంధించి.. గతంలో ఇన్చార్జి డీఎంహెచ్వోగా పనిచేసిన అదనపు డీఎంహెచ్వో పెంచలయ్యను చిత్తూరు జిల్లాకు.. ప్రస్తుత డీఎంహెచ్వో శ్రీహరి పేరును బాలాజీ జిల్లాకు పంపించినట్లు సమాచారం. .
విద్యాశాఖలో ఏడీల సంఖ్య కుదింపు!
కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖలో ఏడీల సంఖ్య నాలుగు నుంచి రెండుకు కుదించనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖలో పరిపాలన, ఆర్థిక, సర్వీసు, కోర్టు ఇతర వ్యవహారాలకు ఇద్దరు.. మధ్యాహ్న భోజన పథకం, మోడల్ స్కూల్ విభాగాలకు ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మోడల్స్కూల్, మధ్యాహ్న భోజన పథకం ఏడీలను ఇతర జిల్లాలకు బదిలీ చేసి, ఈ విభాగాలను మిగిలిన ఇద్దరు ఏడీలకు కేటాయించనున్నారు.
ఎంఆర్సీలుగా ఎంఈవో కార్యాలయాలు: మండల విద్యాశాఖ కార్యాలయాలను మండల రిసోర్స్ సెంటర్లుగా మారుస్తూ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఎంఈవో కార్యాలయాలను ఎంఆర్సీ సెంటర్లుగా పిలవనున్నారు.