కాలుష్యరహిత సమాజమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-19T06:46:21+05:30 IST
కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా మేడ్చల్కు చెందిన మహే్షకుమార్(22) హైదరాబాదు నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేశాడు. ఆదివారం తిరుపతికి చేరుకున్న ఆ యువకుడు తన యాత్రా విశేషాలను తెలియజేశాడు.
హైదరాబాదు నుంచి తిరుపతికి మేడ్చల్ యువకుడి సైకిల్యాత్ర
కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా మేడ్చల్కు చెందిన మహే్షకుమార్(22) హైదరాబాదు నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేశాడు. ఆదివారం తిరుపతికి చేరుకున్న ఆ యువకుడు తన యాత్రా విశేషాలను తెలియజేశాడు.
- తిరుపతి(కొర్లగుంట)
‘మాది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్. మా తల్లిదండ్రులు నందాల దత్తాద్రి, రుక్మిణి. చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలని ధ్యేయంగా పెట్టుకున్నా. క్రీడలపై మక్కువ చూపించి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ల్లో రాణించాను. ప్రస్తుతం హైదరాబాదులోని అంబేడ్కర్ కాలేజీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ సెకండియర్ చదువుతున్నా. కుటుంబ ఆర్థిక స్తోమత సరిగాలేక పోవడంతో పార్ట్టైమ్ జాబ్గా టెన్త్, ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్ ట్యూషన్ చెబుతున్నా. రోజూ ట్యూషన్ చెప్పి రావడానికి 80 కిలోమీటర్లు సైకిల్లోనే వెళ్లి వస్తా. ఈ నేపథ్యంలో కాలుష్యరహిత సమాజంపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం ప్రముఖ దేవాలయాలకు సైకిల్ యాత్ర చేపట్టి తద్వారా ప్రచారం చేయాలని భావించా. ఈ ఏడాది జూన్లో సిద్ధిపేట, వేములవాడ కొండగట్టులోని ఆంజనేయులస్వామి ఆలయానికి ఒక్క రోజులోనే 200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశా. దుబ్బాకలోని రేకులగుంట మల్లన్న ఆలయానికి (200 కిలోమీటర్లు), మెదక్జిల్లా ఏడుపాయలులోని దుర్గమ్మగుడికి (250 కిలోమీటర్లు) కూడా ఒక్క రోజులోనే వెళ్లా. ఇదే స్ఫూర్తితో తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తితో తిరుపతికి సైకిల్ యాత్ర సంకల్పించా. పైగా త్వరలో జరగనున్న ఎగ్జామ్లో ర్యాంకు సాధించి డిఫెన్స్కు ఎంపిక అవ్వాలన్న తల్లి సూచనతో తిరుమలేశుడికి మొక్కుకున్నా. ఈనెల 16వ తేది ఉదయం ఆరు గంటలకు మేడ్చల్లోని స్వగృహం నుంచి సైకిల్ యాత్ర చేపట్టా.
675 కిలోమీటర్లు.. 27 గంటలు
మా ఇంటి నుంచి తిరుపతికి 675 కిలోమీటర్లు. గంటకు 25కిలోమీటర్ల వేగంతో సైకిల్ తొక్కా. అదే రోజు సాయంత్రం కర్నూలుకు చేరుకున్నా. ఆంజనేయస్వామి ఆలయంలో విశ్రాంతి తీసుకొని శనివారం ఉదయం యాత్రను కొనసాగించి సాయంసంధ్యవేళ కడపకు చేరుకున్నా. అక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేదతీరా. ఆదివారం ఉదయం మళ్లీ యాత్ర ప్రారంభించి.. తిరుపతి ఆర్టీసీ బస్టాండు వద్దకు ఉదయం 10.30గంటలకు వచ్చాు. మా ఇంటి నుంచి తిరుపతికి రావడానికి విరామం పోను 27 గంటలపాటు సైకిల్ తొక్కా.
సైకిల్పై దేశాన్ని చుట్టేస్తా
సైకిల్పై దేశాన్ని చుట్టేయాలన్నది నా ఆకాంక్ష. గూగుల్సెర్చ్ ద్వారా స్పోర్ట్స్ సైకిల్ను (ట్రైబన్ ఆర్సీ 100) గుర్తించా. నా సంపాదన రూ.30వేలను వెచ్చించి కొనుగోలు చేశా. దీనికి ఏడు గేర్లు ఉన్నాయి. బరువు తక్కువ. అనువుగా ఉండే సైక్లింగ్ హెల్మెట్, దుస్తులు, షూలు ధరించి గంటల కొద్దీ తొక్కినా అలసట ఉండదు. స్పీడు, కిలోమీటర్లు తెలిపే డిజిటల్ మీటర్, ట్యూబ్లెస్ దీని ప్రత్యేకతలు. ఉత్తరాన కేదార్నాథ్, అయోధ్య, కశ్మీర్.. దక్షిణాన కన్నియాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి తీరుతా.
- మహే్షకుమార్