సీఐ రుషికేశవ కుటుంబానికి రూ.33 లక్షలు
ABN , First Publish Date - 2022-08-08T06:29:24+05:30 IST
విధి నిర్వహణలో శివమణిగా పేరు తెచ్చుకున్న సీఐ రుషికేశవ కుటుంబానికి సహచర ఉద్యోగులు అండగా నిలిచారు.

సహచర ఉద్యోగుల సాయం
మదనపల్లె క్రైం, ఆగస్టు 7: విధి నిర్వహణలో శివమణిగా పేరు తెచ్చుకున్న సీఐ రుషికేశవ కుటుంబానికి సహచర ఉద్యోగులు అండగా నిలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన ఆయన కర్నూలులో సీఐడీ సీఐగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో 2002 బ్యాచ్కు చెందిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఐలు, ఎస్ఐలు ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సంస్మరణ సభ నిర్వహించారు. తాము వసూలు చేసిన రూ.33 లక్షల నగదు చెక్కును రుషికేశవ భార్య సుశీల, ఆమె పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ.. నిక్కచ్చి, నీతి నిజాయితీగా విధులు నిర్వహించిన రుషికేశవ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. రుషికేశవను ఆదర్శంగా తీసుకుని ఆయన బ్యాచ్మెట్స్ విధుల్లో మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. డీఎస్పీ రవిమనోహరాచారి, 2002 బ్యాచ్కు చెందిన సీఐ, ఎస్ఐలు, ప్రకృతివనం ప్రసాద్, ఇతరులు రుషికేశవ సేవలను కొనియాడారు.