వలంటీర్‌ చేతివాటం

ABN , First Publish Date - 2022-08-14T06:12:33+05:30 IST

ఆ వృద్ధుడికి సరిగా కళ్లు కనిపించవు. పింఛన డబ్బుతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.

వలంటీర్‌ చేతివాటం
వృద్ధుడు భూషన్న

వృద్ధుడి ఖాతా నుంచి రూ.40 వేలు మాయం

పుట్లూరు, ఆగస్టు 13: ఆ వృద్ధుడికి సరిగా కళ్లు కనిపించవు. పింఛన డబ్బుతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇదే అదనుగా గ్రామ వలంటీర్‌ రూ.40వేలు కాజేశాడు. పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన ఎర్రనాగప్ప గ్రామ వలంటీర్‌గా, బ్యాంకుమిత్రగా పనిచేస్తున్నాడు. ఇదే గ్రా మానికి చెందిన వృద్ధుడు భూషన్నకు కళ్లు సరిగా కనిపించవని తెలుసుకుని, చేతివాటం ప్రదర్శించాడు. జూలై నెల పింఛన ఇచ్చే సమయంలో సర్వర్‌ సమస్య అని నమ్మించి, నాలుగుసార్లు వేలిముద్రలు వేయించుకున్నాడు. ఆ తరువాత సర్వర్‌ సమస్య అలాగే ఉందని, డబ్బులు రావని తేల్చిచెప్పాడు. జూలై నెలలో వృద్ధుడి ఖాతాలో ఉన్న రూ.46,443లో.. రూ.40 వేలను నాలుగు విడతలుగా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. డబ్బులు డ్రా చేసేందుకు బంధువుల సాయంతో శుక్రవారం పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ వద్దకు భూషన్న వెళ్లిన సమయంలో ఈ మోసం బయట పడింది. తన ఖాతాలో రూ.6 వేలు మాత్రమే ఉందని బ్యాంకు అధికారులు తెలపడంతో వృద్ధుడు నివ్వెరపోయాడు. ఆ తరువాత వృద్ధుడు, బంధువులు వలంటీర్‌ను నిలదీశారు. తప్పు జరిగిందని, డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినట్లు సమాచారం. గతంలో ఆ వలంటీర్‌ ఓ చెవిటి మహిళ డబ్బులు కాజేశాడు. పంచాయితీ పెట్టి డబ్బులు తిరిగి ఇప్పించినట్లు సమాచారం.

Updated Date - 2022-08-14T06:12:33+05:30 IST