రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఐక్య ఉద్యమం

ABN , First Publish Date - 2022-11-17T00:05:16+05:30 IST

వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఐక్య ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఐక్య ఉద్యమం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం కల్చరల్‌, నవంబరు 16: వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఐక్య ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి అవకాశాలు - ఆటంకాలు అనే అంశంపై గుంతకల్లులో రెండురోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు నేపథ్యంలో బుధ వారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని గణేనాయక్‌భవనలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో రాయలసీమ జనాభా 30 శాతమేనని, మొత్తం సాగుభూమిలో 36.8శాతం ఈ ప్రాంతంలో సాగవుతోందన్నారు. అయితే 7.6శాతం భూమికి మాత్రమే సాగునీటి వసతి ఉందని తెలిపారు. కనీసం పదివేలమందికి ఉపాధి చూపే ఒక్క పరిశ్రమ కూడా ఈ ప్రాంతంలో లేకపోవడం బాధాకరమన్నారు. అనేక దశాబ్దాల క్రితం నిర్మించిన తుంగభద్ర, హెచ్చెల్సీలు వ్యవసాయ అవసరాలను ఏమాత్రం తీర్చేవిగా లేవన్నారు. సాగునీటి కాలువలు క్రమంగా తాగునీటి కాలువలుగా మారిపోతున్నాయన్నారు. హంద్రీనీవా పథకం ద్వారా పంట పొలాలకు నీరివ్వాల్సిందిపోయి చెరువులు నీరు నింపే పథకంగా మారింద న్నారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి 3 సంవత్సరాల్లోపు ఖర్చు చేయాలని, రాయలసీమలోని ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ 3 సంవత్సరాల్లో పూర్తిచేసి ఈ ప్రాంత సాగుభూములకు ఏడాదికి ఒక్క పంటకైనా నీరందించాల్సిన అవసరముందన్నారు. రాయలసీమలోని పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 సంవత్సరాలు పన్ను రాయితీ కల్పించాలని, కడప జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలన్నారు. రాయలసీమలో మైనింగ్‌ ఇనస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని, మైనింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 50శాతం రాయలసీమ అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకోసం రాయలసీమ వ్యాప్తంగా ఐక్యఉద్యమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-11-17T00:05:17+05:30 IST