ఇక్కడే ఉంటాడంట..!
ABN , First Publish Date - 2022-10-07T05:49:23+05:30 IST
మైనార్టీ సంక్షేమశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. సొంత శాఖకు సరెండర్ అయిన ఓ అధికారి.. అనంతను వీడటం లేదు.
అనంతను వీడని ఆ అధికారి.. సరెండర్ రద్దుకు ప్రయత్నాలు
అనంతపురం ప్రెస్క్లబ్, అక్టోబరు 6: మైనార్టీ సంక్షేమశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. సొంత శాఖకు సరెండర్ అయిన ఓ అధికారి.. అనంతను వీడటం లేదు. ఇక్కడే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ అధికారి కోసం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి విజయవాడకు వెళ్లాడంటే.. ఆ అధికారి ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ అధికారిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకున్నారు. సొంతశాఖకు బదిలీ చేస్తూ గత నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంత వరకూ ఆ అధికారి సొంతశాఖకు వెళ్లలేదు. అనంతలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారు. తనను అదేశాఖలో కొనసాగించేలా చూడాలని ఆయన వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో విజయవాడలోని కార్యాలయంలో రెండు రోజులపాటు తీవ్రంగా ప్రయత్నించాడని, ఫలితం లేక వెనుదిరిగాడని తెలిసింది.
అంటకాగుతూ..
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి అధికార పార్టీ నేతలతో మొదటి నుంచి అంటకాగుతున్నారు. ఏ సమస్య వచ్చినా వారిద్వారానే పరిష్కరించుకుంటున్నారు. సరెండర్ ఉత్తర్వులు వచ్చినా.. ఇప్పుడూ అధికార పార్టీవారినే ఆశ్రయించాడు. ఆయన కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధి రాజధానికి వెళ్లి మాట్లాడటం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. ఆ అధికారి తీరుపై కొందరు అధికార పార్టీ నాయకులూ అసంతృప్తిగా ఉన్నారు. ఆ అధికారికి మద్దతుగా ఉన్న ప్రజాప్రతినిధి అంటే వీరికి గిట్టడం లేదని సమాచారం. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి గతంలో రాష్ట్రశాఖకు ఫిర్యాదు చేశారు.
తలొగ్గుతారా...?
ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారిని సొంతశాఖకు సరెండర్ చేస్తూ ప్రత్యేక జీవో జారీ చేశారు. దీన్ని మార్పించేందుకు ఆ అధికారి అనంతలోనే తిష్టవేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లకు రాష్ట్రస్థాయి అధికారులు ఎలా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది. ఒక్క అధికారి కోసం జీవోను వెనక్కు తీసుకుంటే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు.