ఇంచు భూమీ వదలకుండా రీ సర్వే

ABN , First Publish Date - 2022-12-07T00:08:47+05:30 IST

జిల్లా వ్యాప్తంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌లు అధికారులను ఆదేశించారు.

ఇంచు భూమీ వదలకుండా రీ సర్వే
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం టౌన, డిసెంబరు6: జిల్లా వ్యాప్తంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో మంగళవారం భూ రీసర్వేపై అధికారులతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 41 గ్రామాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా రీసర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రీసర్వే చేపట్టాలన్నారు. మొత్తం ఆరు విడతలలో ఈ రీసర్వే జరగుతుందన్నారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన ద్వారా నిబందనలను వివరించారు. రీసర్వే వేగవంతం చేయడానికి ఇప్పటికే మండలానికి ప్రత్యేకంగా డిప్యూటీ తహసీల్దార్‌లను నియమించామన్నారు. గ్రామ స్థాయిలో సర్వేయింగ్‌ టీమ్‌లు సర్వే నంబర్‌ ప్రకారం సర్వే చేపట్టాలన్నారు. ఇంచు భూమి కూడా వదలకుండా సర్వే చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లు, 31 మండలాలు, 577 గ్రామ పంచాయితీలు, 6 మున్సిపాలిటీల్లో కలిపి 10,204.35 చదరపు కిలోమీటర్ల భూమి ఉందన్నారు. ఈ భూమిలో రీసర్వే వెంటనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రీసర్వే పూర్తి చేసి హక్కుపత్రాలు అందించాలన్నారు. ఈ సర్వేలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ప్రభాకరరావుతో పాటు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:08:48+05:30 IST