నల్లి విధ్వంసం

ABN , First Publish Date - 2022-11-05T23:38:00+05:30 IST

మిరప పంటను నల్లిపురుగు ఆశించింది. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.

నల్లి విధ్వంసం
తెల్లగా మారిన మిరప కాయలు

35 వేల ఎకరాల్లో మిరప పంట నష్టం

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

ఎకరానికి రూ.లక్ష వరకూ పెట్టుబడి

సీడ్‌, డబ్బీ రకం సాగుచేసి.. అప్పులపాలు

విడపనకల్లు

మిరప పంటను నల్లిపురుగు ఆశించింది. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉరవకొండ నియోజకవర్గంలో జీబీసీ, హంద్రీనీవా, బోరు బావుల కింద 35 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. సుమారు రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టారు. జూలైలో సాగు చేసిన ఈ పంట ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. కీలకమైన ఈ సమయంలో నల్లి పురుగు (నల్లి తామర) ఆశించింది. దీంతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి. మిరప పూతపై నల్లి పురుగులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇవి పూత సారాన్ని పీల్చి, మరో పూతకు చేరుతున్నాయి. చిగుళ్లలో చేరి మొక్కను ఎదగనివ్వకుండా తినేస్తున్నాయి. ఎర్రగా ఉన్న కాయలపై నల్ల మచ్చలు ఏర్పడి, కుళ్లిపోతున్నాయి. కొన్ని రంగుమారి తెల్లగా అవుతున్నాయి. దీంతో ఎకరాకు 10 కేజీలు కూడా దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది.

భారీగా పెట్టుబడి..

మిర్చి రైతులు ఇప్పటికే 75 శాతం పెట్టుబడి పెట్టారు. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు చేశారు. నారు సాగుకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు, ఎరువు ఎకరానికి రూ.20 వేలు, బయోజెమ్‌ మందులు ఎకరాకు రూ.వెయ్యి, నీళ్ల మందులు ఎకరాకు రూ.20 వేలు, సేద్యపు ఖర్చులు రూ.20 వేలు, కూలీలకు రూ.25 వేలకు పైగా ఖర్చు చేశారు. కౌలు రైతులకు అదనంగా ఎకరాకు రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు చేయడం సాహసమే..! బాగా పండితే రైతుల కష్టాలు తీరుతాయి. సీడ్‌ పంట బాగా పండితే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ధర పలుకుతుంది. డబ్బీ రకం కాయలు ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇది క్వింటా రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుంది. అందుకే.. రైతులు అప్పులు చేసి మరీ పంటను సాగుచేశారు.

రూ.7 లక్షలకు పైగా నష్టం..

నేను 8 ఎకరాల్లో డబ్బీ రకం మిరప పంటను సాగు చేశాను. రకరకాల మందులు వాడి పంటను కాపాడుకుంటూ వచ్చాను. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటకు నల్లి పురుగు సోకింది. ఒక్కో పువ్వుపై 20 నుంచి 30 పురుగులు కనిపిస్తున్నాయి. ఇంక ఏ మందు పిచికారీ చేసినా ఫలితం లేదు అని వదిలేశాను. రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను.

- డి క్రిష్ణయ్య, విడపనకల్లు రైతు

మొత్తం పంట పోయింది..

ఎనిమిది ఎకరాలను కౌలుకు చేశాను. నాలుగు ఎకరాల్లో సీడ్‌ కాయలు, మరో నాలుగు ఎకరాల్లో డబ్బీ రకం సాగు చేశాను. నల్లి దెబ్బకు సీడ్‌ మిరప పెరుగుదల ఆగిపోయింది. డబ్బీ రకం కాయలు తెల్లగా మారాయి. ఈ పంట తొలగింపు ఖర్చుతో కూడుకున్నది. మిరప మధ్యలో మొక్క జొన్న సాగు చేస్తాను. ఇలా చేస్తే కనీసం పెట్టుబడులు, కౌలు ఖర్చులైనా వస్తాయని ఆశిస్తున్నాను.

- టి రామాంజినేయులు, విడపనకల్లు రైతు

వాడిపోతోంది..

నేను పది ఎకరాల్లో మిరప సాగు చేశాను. నల్లిపురుగు దెబ్బకు ఎక్కడా కాయలు కనిపించడం లేదు. పూత మొత్తం కుళ్లిపోతోంది. కాయలకు మచ్చలు ఏర్పడుతున్నాయి. నల్ల మచ్చలు వచ్చాయంటే కాయలు పనికి రావు. మొక్కలో పెరుగుదల అయినా ఉంటే ఏదో ఒక మందును పిచికారీ చేసి పంటను కాపాడు కోవచ్చు. ఏం చేసినా ఫలితం లేక పంటను వదిలేశాను. పంటను తొలగించి ప్రత్యామ్నాయ పంటను సాగు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికే రూ.8 లక్షలు నష్టపోయాను.

- బి బొజ్జప్ప, చీకలగురికి రైతు

వద్దని చెప్పాం..

నీలి రంగు లేదా తెలుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 35 నుంచి 40 ఏర్పాటు చేసుకోవాలి. పురుగు ఉధృతి తగ్గే వరకూ వివిధ రకాల మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఒక్కసారి నల్లి పురుగు ఆశించిన తరువాత అదే పంటను రెండోసారి వేయకూడదు. తప్పని సరిగా పంట మార్పిడి చేయాలి. ఈ సారి కూడా నల్లి పురుగు ఉధృతి ఉంటుందని, మిరప సాగు చేయవద్దని రైతులకు సూచించాము. ఈ దశలో ఏమీ చేయలేం. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి, ఉన్న పంటను కొంత మేరకు కాపాడుకోవచ్చు. మొదట్లోనే సామూహిక సేద్యం చేయడం ద్వారా మిరపలో నల్లిపురుగును కొంత నివారించవచ్చు.

- డాక్టర్‌ విమల, హార్టికల్చర్‌ సైంటిస్టు

Updated Date - 2022-11-05T23:38:04+05:30 IST