జొన్న పంటను కొంటాం

ABN , First Publish Date - 2022-03-05T05:32:05+05:30 IST

రైతులు పండించిన జొన్న పంటను ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ ద్వారా నేరుగా కొనుగోలు చేస్తామని అనంతపురం ఏడీఎం పరమేశ్వరయ్య శుక్రవారం సాయంత్రం హావళిగి రైతులకు ఫోన ద్వారా తెలియజేశారు.

జొన్న పంటను కొంటాం
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఏడీఎం పరమేశ్వరయ్య

విడపనకల్లు, మార్చి 4: రైతులు పండించిన జొన్న పంటను ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ ద్వారా నేరుగా కొనుగోలు చేస్తామని అనంతపురం ఏడీఎం పరమేశ్వరయ్య శుక్రవారం సాయంత్రం హావళిగి రైతులకు ఫోన ద్వారా తెలియజేశారు. జొన్న దిగుబడిని అమ్మనివ్వకుండా దళారులు అడ్డుపడుతుండడంపై ‘జొన్న రైతులపై పగ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. హావళిగి రైతులకు ఫోన చేసి, వారు సాగు చేసిన జొన్న రకం, వాటి గ్రేడింగ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జొన్న రకాల శాంపిళ్లను తమకు  ఇవ్వాలని, లేదంటే గ్రామానికి వచ్చి తీసుకోమన్నా వస్తామని అధికారులు చెప్పినట్లు రైతులు తెలియజేశారు. దళారీల ప్రమేయం లేకుండా కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారని, దీంతో జొన్న రకాలను ఫొటో తీసి, పంపామని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఈ-ఫార్మర్‌ మార్కెట్‌ అధికారి ప్రసాద్‌ను సంప్రదించగా, రైతులు పంపిన శాంపిళ్లను హైదరాబాద్‌, నెల్లూరు, విజయవాడకు పరిశీలన నిమిత్తం పంపామని అన్నారు. వీటిని టీబీహెచ అజయ్‌కుమార్‌ రెండు రోజుల్లో పరిశీలిస్తారని, అనంతరం రైతుల వద్దకే వెళ్లి పంటను కొనుగోలు చేస్తామని తెలిపారు. అక్కడే చెల్లింపులు కూడా జరిగేలా చూస్తామని అన్నారు. దీంతో జొన్న రైతులు హర్షం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-03-05T05:32:05+05:30 IST