పట్టపగలు కిడ్నాప్
ABN , First Publish Date - 2022-08-08T06:10:27+05:30 IST
పట్టణంలోని బళ్లారి రోడ్డు కుంటు మారెమ్మ దేవాలయం వద్ద ఎక్స్ప్రెస్ కూన తిప్పేస్వామి పెద్ద కుమారుడు సిద్దేశ్వర (52)ను ఆదివారం పట్టపగలే కిడ్నాప్ చేశారు

రాయదుర్గంటౌన, ఆగస్టు 7: పట్టణంలోని బళ్లారి రోడ్డు కుంటు మారెమ్మ దేవాలయం వద్ద ఎక్స్ప్రెస్ కూన తిప్పేస్వామి పెద్ద కుమారుడు సిద్దేశ్వర (52)ను ఆదివారం పట్టపగలే కిడ్నాప్ చేశారు. అర్బన సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణవాసి సిద్దేశ్వరను కిడ్నాప్ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన మల్లాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సన్నలింగప్ప కూన తిప్పేస్వామి తోటలో పనిచేస్తున్న వారికి సమాచారం చేరవేశాడు. సిద్దేశ్వర తమ్ముడు జగదీష్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ పొలం లో పనిచేస్తున్న కూలీలకు ద్విచక్రవాహనంలో మ ధ్యాహ్న భోజనం తీసుకెళ్తుండగా కుంటు మారెమ్మ దేవాలయం వద్ద కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. భోజనం క్యారియర్తోపాటు ద్విచక్రవాహనాన్ని అక్కడే పడేశారు. సిద్దేశ్వర చెల్లెలు మంజుల, బావ కేశవ బళ్లారిలో నివాసం ఉంటున్నారు. బళ్లారికి చెందిన తిమ్మప్ప వద్ద కేశవ దాదాపు రూ.రెండు కోట్లు అప్పు చేశాడు. అప్పు చెల్లింపు విషయమై బళ్లారిలో పలుమార్లు పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. కేశవ అప్పు చెల్లించకపోవడంతో అతడి బావ సిద్దేశ్వరను తిమ్మప్ప కిడ్నాప్ చేయించాడన్న అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.