బంధువు అంత్యక్రియలకు వెళ్తూ..
ABN , First Publish Date - 2022-08-20T05:22:03+05:30 IST
సమీప బంధువు మృతి చెందటంతో అంత్యక్రియలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలు కాగా మరొకరు స్వ ల్ప గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
స్వల్ప గాయాలతో బయటపడ్డ కుమారుడు
కణేకల్లు, ఆగస్టు 19: సమీప బంధువు మృతి చెందటంతో అంత్యక్రియలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలు కాగా మరొకరు స్వ ల్ప గాయాలయ్యాయి. వివరాల మేరకు మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంకులో మల్లికార్జున (55) సీఈఓగా గత రెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి అమరాపురంలో తమ సమీప బంధువైన నాగయ్య మృతి చెందడంతో తన భార్య విజయలలిత, కుమారుడు అరవింద్తో కలిసి ద్విచక్రవాహనంలో శుక్రవారం ఉదయం బయలుదేరాడు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి వద్ద బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లికి చెందిన వెంకటేశులు ద్విచక్రవాహనంలో వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో మల్లికార్జున, విజయలలిత (45)కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు మల్లికార్జునను అనంతపురానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన విజయలలితను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికు తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు బంధువులు తెలిపారు. ప్రమాదంలో వీరి కుమా రుడు అరవింద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరో ద్విచక్రవాహనదారుడు వెంకటేశులుకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.