ఎట్లుంటేనేం.. కడుతున్నారు.. కదా..!
ABN , First Publish Date - 2022-04-23T07:04:17+05:30 IST
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్కేర్ సెంటర్ల భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.
ప్రభుత్వ భవన నిర్మాణాలపై వింత వాదన
నిర్మాణ దశలోనే ప్రభుత్వ భవనాలకుపగుళ్లు
నాణ్యత పాటించని కాంట్రాక్టర్లకు అధికారుల వత్తాసు
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్కేర్ సెంటర్ల భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నిర్మాణ దశలోనే పునాదుల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీనిపై ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులను ప్రశ్నిస్తే.. ‘పనులను చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కాళ్లూ కడపులు పట్టుకుని ఎవరో ఒకరితో పని చేయిస్తున్నాం. వాళ్లను కూడా చెయ్యనివ్వరా..?’ అని సమర్థించుకుంటున్నారు.
విడపనకల్లు : విడపనకల్లు మండలంలో ఒక్కొక్క భవనానికి రూ.45 లక్షలు ప్రకారం 18 సచివాలయాలు, రూ.17 లక్షలు ప్రకారం 18 హెల్త్కేర్ సెంటర్లు, రూ.20 లక్షల ప్రకారం 18 ఆర్బీకేలు నిర్మించతలపెట్టారు. 17 పంచాయతీల పరిధిలో రూ.15.30 కోట్లతో భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను గ్రామాల్లోని వైసీపీ నాయకులు, వారి అనుచరులే చేయిస్తున్నారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యత పాటించటం లేదు. వేల్పుమడుగులో సచివాలయ భవనం నిర్మాణ దశలోనే పునాదుల్లో చీలికలు వచ్చాయి. గోడలు పూర్తిగా నాసిరకంగా నిర్మించారు. మాళాపురం సచివాలయ భవన నిర్మాణానికి ఇసుకకు బదులుగా క్రషర్ డస్ట్ను వాడుతున్నారు. దీంతో నాణ్యత లోపించి దెబ్బతింటున్నాయి. వి.కొత్తకోట ఆర్బీకే భవన నిర్మాణంలోనూ నాణ్యత కనిపించడం లేదు. పాత పంచాయతీ కార్యాలయ భవనాన్ని కూలదోసి, దాని స్థానంలో సచివాలయ భవన నిర్మాణం చేపట్టారు. తొలగించిన రాళ్లను ఆర్బీకేనిర్మాణానికి వాడుకున్నారు. దీంతో ఆర్బీకే పునాదుల్లో అప్పుడే చీలిక వచ్చింది. భారీగా పగుళ్లు ఉన్నచోట సిమెంట్ పూతను పూసి కప్పిపుచ్చారు. పాల్తూరులో ఊరికి దూరంగా మూడు సచివాలయ భవనాలను ఒకేచోట నిర్మిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందిగా మారనుంది. భవన నిర్మాణాల్లో నాణ్యత పాటించక పోవటానికి కారణం పర్సెంటేజీల కక్కుర్తే అని గ్రామీణ ప్రజలు విమర్శిస్తున్నారు. వేల్పుమడుగు సచివాలయ నిర్మాణం నాసిరకంగా ఉందని ఆ గ్రామ సర్పంచ, గ్రామ పెద్దలు జిల్లా, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన మండల సమావేశంలో నాణ్యతలేని నిర్మాణాలపై సర్పంచలు మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఏఈ వెంకట శేషయ్య కాంట్రాక్టర్లను వెనుకేసుకొచ్చారు. భవన నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావటంలేదని, కాళ్లు కడుపులు పట్టుకుని ఎవరో ఒకరితో పనులు చేయించుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. వారిని కూడా పనులు చేయన్విరా..? అని ప్రశ్నించారు. నాణ్యతా ప్రమాణాలు లేకున్నా.. ఎవరూ ప్రశ్నించకూడదు అన్న చందంగా వ్యవహరించారు.