సీఎం విడుదల చేసి 52 రోజులు
ABN , First Publish Date - 2022-08-06T05:53:29+05:30 IST
సీఎం జగన పంటల బీమా సొమ్ము బటన నొక్కి వెళ్లి 50 రోజులకు పైగా గడిచింది. ఇప్పటికీ చాలామంది అర్హుల ఖాతాలో సొమ్ము జమకాలేదు
బటన బీమా..!
ఇప్పటికీ జమకాని బీమా సొమ్ము
అర్జీలు స్వీకరించి.. వదిలేశారు
బాధిత రైతుల ఆవేదన
అనంతపురం అర్బన
సీఎం జగన పంటల బీమా సొమ్ము బటన నొక్కి వెళ్లి 50 రోజులకు పైగా గడిచింది. ఇప్పటికీ చాలామంది అర్హుల ఖాతాలో సొమ్ము జమకాలేదు. బాధితులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం, ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారు. వారికి పొంతనలేని సమాధానాలు చెప్పి పంపుతున్నారు. జూన 14న సీఎం జగన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి బహిరంగ సభలో బటన నొక్కి, ఉచిత పంటల బీమా సొమ్ము విడుదల చేశారు. గత ఏడాది ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోయిన 2.32 లక్షల మంది రైతులకు రూ.629.77 కోట్లు జమ చేస్తున్నామని ప్రకటించారు. జాబితాలో పేరున్న వేలాదిమంది రైతులకు ఇప్పటికీ బీమా సొమ్ము జమచేయలేదు. ఒకే ఊరిలో కొందరికి డబ్బులు జమ అవ్వడం, మరికొందరికి జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇంకా ఎంతమంది రైతులకు జమకాలేదో, ఇప్పటి వరకూ ఎంతమందికి బీమా సొమ్ము చెల్లించారో కూడా అధికారులకు తెలియదంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీరు కారణంగానే జిల్లాస్థాయి అధికారులకు వివరాలు అందలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
సస్పెక్ట్, హోల్డ్లో..
బీమా అర్హత జాబితాలోని వేలాది మంది రైతుల పేర్లను సస్పెక్ట్, హోల్డ్లో పడేశారు. అర్హత ఉన్నందున తమ పేర్లు జాబితాలో ఎక్కించారని, అలాంటప్పుడు సస్పెక్ట్, హోల్డ్లో ఎందుకు వేసి సతాయిస్తున్నారని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. సస్పెక్ట్, హోల్డ్ జాబితా రైతుల వ్యవహారం ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కువ మొత్తం బీమా వర్తించిన రైతులను హోల్డ్లో ఉంచారని సమాచారం.
స్పందన అర్జీలకు దిక్కులేదు
పంటల బీమా జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులు చాలామంది ఆందోళనకు దిగారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఎదుట నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం జూన 19 నుంచి 21 దాకా అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక స్పందన నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 11,974 మంది రైతులు తమ పేర్లు బీమా జాబితాలో లేవని అర్జీలు ఇచ్చారు. ఇందులో 4,765 అర్జీలను పరిష్కరించదగినవిగా అధికారులు గుర్తించారు. 7,209 అర్జీలను తిరస్కరించారు. గత ఏడాది ఈ-క్రాపింగ్, ఈకేవైసీ చేయించిన రైతుల అర్జీలను మాత్రమే అర్హమైనవిగా గుర్తించి, ఆనలైనలో అప్లోడ్ చేశారు. మిగతా వాటిని అనర్హత జాబితాలో ఎక్కించారని సమాచారం. స్పందనకు ముందే మండల వ్యవసాయ అధికారి, రైతు భరోసా కేంద్రాల్లో వేలాది మంది రైతులు అర్జీలు ఇచ్చారు. ఇప్పటి వరకూ వీటిని పరిష్కరించలేదు. అర్హులను హోల్డ్, సస్పెక్ట్లో ఉంచడం, అర్జీలను తీసుకుని మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు.
బీమా జమ చేయలేదు..
రెండెకరాల్లో దానిమ్మ సాగు చేశాం. దిగుబడి సరిగారాక నష్టపోయాం. వ్యవసాయ అధికారులు మా పొలానికి వచ్చి ఈ-క్రాపింగ్, ఈకేవైసీ వేలిముద్ర వేయించుకున్నారు. జాబితాలో పేరున్నా ఇప్పటి దాకా బీమా సొమ్ము జమ చేయలేదు. ఎప్పుడు వేస్తారో అర్థం కావడం లేదు.
- సరస్వతి, రైతు, కొండుగారుకుంట, పుట్లూరు మండలం
ఎప్పుడిస్తారో ఏమో...
గత ఏడాది ఐదెకరాల్లో మిరప సాగు చేశాను. అధిక వర్షానికి పొలంలోనే పంట దెబ్బతింది. ఎకరాకు రూ.70 వేలకుపైగా పెట్టుబడి ఖర్చు అయ్యింది. కూలీల ఖర్చులకు కూడా డబ్బులు రాలేదు. బీమా జాబితాలో పేరున్నా ఇప్పటి దాకా సొమ్ము చెల్లించలేదు. ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఎప్పుడు ఇస్తారో ఏమో అర్థం కావడం లేదు.
- లక్ష్మయ్య, రైతు, డొనేకల్లు, విడపనకల్లు మండలం