AP News: ఎన్టీఆర్ ఆరోగ్య రథం ప్రారంభించిన బాలకృష్ణ దంపతులు
ABN , First Publish Date - 2022-08-17T21:44:49+05:30 IST
ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని (NTR health chariot) బుధవారం బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు.
శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లా: హిందూపురం (Hindupuram) మండల పరిధిలోని చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని (NTR health chariot) బుధవారం బాలకృష్ణ దంపతులు (Balakrishna Family) ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా చేసుకోవాల్సిన పండుగ రోజని, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలన్నారు. టీడీపీని ఆదరిస్తున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీలో ఒక్కడినని.. రూ. 40 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ ఆరోగ్య రథం వాహనాన్ని తయారు చేశామన్నారు. మొబైల్ క్లినిక్ (Mobile Clinic) అన్ని రకాల వైద్య సదుపాయాలు అందులో ఉన్నాయన్నారు. 200 వైద్య పరీక్షలు చేసుకోవచ్చునని, మందులు ఉచితంగా అందజేస్తామన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలను ఉపయోగించకుండా పక్కన పడేయడం సిగ్గుచేటని బాలకృష్ణ అన్నారు. ఇంక్యుబేటర్లు పక్కన పడేశారని, సిగ్గు.. శరం ఉన్నవాళ్లు ఆలోచించాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని పార్టీలకతీతంగా అందించామని, మనిషిని మనిషిగా గౌరవించాలని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. ఒక్క హిందూపురం, మంగళగిరి మాత్రమే కాదని.. రాష్ట్రం మొత్తం వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా వాహనానికి అపకారం చేస్తారేమోనని సీసీటీవీ (CCTV) పెట్టించామన్నారు. హిందూపురంను ఆరోగ్యపురంగా చేయాలన్నదే తమ అందరి ధ్యేయమని బాలకృష్ణ స్పష్టం చేశారు.