న్యాయవిద్యకు మంగళం

ABN , First Publish Date - 2022-12-07T00:05:48+05:30 IST

దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్కేయూలో ఎన్నడూ లేని విధంగా వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిఏటా ‘లా’సెట్‌ నిర్వహించే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యకు మంగళం పాడేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైంది. ఎంతో పేరొందిన ఎస్కేయూలో ఎల్‌ఎల్‌బీ కోర్సును మూసివేందుకు అడుగులు పడ్డాయి

న్యాయవిద్యకు మంగళం
ఎస్కేయూ న్యాయశాస్త్ర విభాగం..

ఎస్కేయూలో ఎల్‌ఎల్‌బీ కోర్సు మూసివేతకు అడుగులు

బోధనసిబ్బంది లేక ప్రవేశాలు వద్దంటున్న యాజమాన్యం

ఆందోళన బాటలో విద్యార్థులు

అనంతపురం సెంట్రల్‌: దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్కేయూలో ఎన్నడూ లేని విధంగా వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిఏటా ‘లా’సెట్‌ నిర్వహించే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యకు మంగళం పాడేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైంది. ఎంతో పేరొందిన ఎస్కేయూలో ఎల్‌ఎల్‌బీ కోర్సును మూసివేందుకు అడుగులు పడ్డాయి. ప్రవేశాలు వద్దంటూ వర్సిటీ యాజమాన్యం లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా జడ్జిలు, న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను అందించిన ఎస్కేయూ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశాలను కల్పించకపోవడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలను తాత్కాలికంగా రద్దు చేయాలని ఎస్కేయూ యంత్రాంగం సిద్ధమైంది. సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతో నాణ్యమైన విద్యనందించడం కష్టతరమని, వచ్చే విద్యా సంవత్సరానికి తగిన సిబ్బందిని ఏర్పాటుచేసుకుని ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో లా అడ్మిషన్లు యథావిధిగా కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన మోహన రెడ్డికి లేఖ రాశారు. ఎస్కేయూలో మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ప్రవేశాలు రద్దుచేయాలని వర్సిటీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. విద్యార్థి సంఘాలు వినూత్న రీతిలో నిరసనచేస్తూ ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ప్రవేశాలు కల్పించాలని ఆందోళనలు చేస్తున్నాయి. అడ్మిషన్ల నిలుపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు.

ఏటా 108 సీట్ల కేటాయింపు

దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేయూ లా కాలేజ్‌లో ప్రతి ఏటా ఎల్‌ఎల్‌బీ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు 88, రెండు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 30 సీట్లు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాత్రమే విద్యార్థులకు బోధిస్తున్నారు. నిబంధనలకు మేరకు ఆరుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు ప్రొఫెసర్లు మొత్తం 12 మంది బోధనా సిబ్బంది ఉండాలి. ఆ మేరకు సిబ్బందిని నియమించాల్సిన యాజమాన్యం కోర్సును మూసివేసేందుకు సిద్దమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-12-07T00:05:48+05:30 IST