ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. వైసీపీ నేతపై వేటు
ABN , First Publish Date - 2022-01-30T18:03:19+05:30 IST
ఏబీఎన్ ఎఫెక్ట్.. ముదిగుబ్బ వైసీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణ రెడ్డిపై వేటు పడింది.
అనంతపురం: రెవెన్యూ అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన ముదిగుబ్బ వైసీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణ రెడ్డిపై వేటు పడింది. ముదిగుబ్బ మండల సర్వేయర్తో పాటు రెవెన్యూ అధికారులను నారాయణరెడ్డి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై స్పందన వచ్చింది. ఇందుకూరు నారాయణరెడ్డిని ముదిగుబ్బ మండల కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరుతో ప్రకటన విడుదలైంది. ఇందుకూరు నారాయణరెడ్డి సర్వేయర్తో మాట్లాడిన ఫోన్ సంభాషణ తీరు అభ్యంతరకరమంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ధర్మవరం నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరుడు, వైసీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణ రెడ్డి రెచ్చిపోయారు. ముదిగుబ్బ మండల సర్వేయర్తో పాటు రెవెన్యూ అధికారులను బూతులు తిట్టారు. ఎమ్మెల్యేకు ...తనకు సమాచారం అందించకుండా మండలంలో సర్వే ఎలా చేస్తారంటూ సర్వేయర్పై మండిపడుతూ అమ్మనా బూతులు తిట్టారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో సర్వే పనులకు వెళ్ళినట్లు చెప్పడంతో మరింత రెచ్చిపోయారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్పై కూడా రెచ్చిపోయారు.