ప్లాట్ల బాధితులకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2021-12-31T05:20:58+05:30 IST
ప్లాట్ల బాధితులకు అండగా ఉంటాం

ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ మండలం వెంకటాపూర్(కొర్రెముల రెవెన్యూ) పంచాయతీ పరిధి సర్వేనెంబర్ 796 లేఅవుట్లోని ప్లాట్ల బాధితులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. గురువారం ప్లాట్ల బాధితులతో కలిసి ఆయన ప్లాట్లను పరిశీలించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ.. లేఅవుట్లో మధ్యతరగతి, విశ్రాంత, ఆర్మీ ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. కాగా, గాయత్రి ఎడ్యుకేషనల్ కల్చరల్ సొసైటీ యాజమాన్యం ప్లాట్ల యజమానులను భయబ్రాంతులకు గురిచేసి వారి ప్లాట్లను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మధ్యతరగతి ప్లాట్ల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్లాట్ల ఆక్రమణలను ఆపకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీయడం ఖాయమని హెచ్చరించారు. బాధితులకు న్యాయంజరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్లాట్ల యజమానులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, సర్వేనెంబర్ 796లో గత ప్రభుత్వ హయాంలో 2012లో 38ఈ కింద భూమిని చట్టప్రకారమే కొనుగోలుచేసి మ్యుటేషన్ చేయించుకున్నామని, చట్ట ప్రకారమే హెచ్ఎండీఏ అనుమతులు పొంది నిర్మాణాలు చేస్తున్నామని, ప్లాట్లను కబ్జా చేయలేదని గాయత్రి ఎడ్యుకేషనల్ కల్చరల్ సొసైటీ యాజమాన్యం తెలిపింది.