టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణ నేటి నుంచి
ABN , First Publish Date - 2021-02-12T05:00:48+05:30 IST
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేడు(శుక్రవారం)
- ఒక్కో నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా నమోదు
- కార్యాచరణ సిద్ధం చేసిన ఎమ్మెల్యేలు
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేడు(శుక్రవారం) శ్రీకారం చుట్ట బోతోంది. రెండేళ్లుగా ఎన్నికలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి కేంద్రీ కరించిన టీఆర్ఎస్ అధిష్ఠానం.. క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్య క్రమం చేపట్టి కమిటీల నియామకం చేయాలని నిర్ణయించింది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు వికారాబాద్ జిల్లాలో పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమం చేపట్టేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ అధినేత నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సభ్యత్వాలు చేయించేందుకు ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు వంతున ఇన్చార్జిలను నియమించారు. వికారాబాద్ జిల్లాకు జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా ఎంపీ రాములు, సెక్రటరీ ఇన్చార్జిగా జహంగీర్ పాషాలను పార్టీ నియమించింది. 2019లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 1.80 లక్షల సభ్యత్వాలు నమోదు చేయగా, ఈసారి రెండు లక్షలకు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 50వేలకు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమంలో పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 50వేలకుపైగా సభ్యత్వాలు చేయగా, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో 40వేల సభ్యత్వాలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లక్ష్యానికి అనుగుణంగా సభ్యత్వం నమోదు చేసే విధంగా ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నవాబుపేట మండలం ఉంది. ఈ అయిదు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
15 రోజులపాటు సభ్యత్వ నమోదు
వికారాబాద్ జిల్లాకు నాగర్కర్నూల్ ఎంపీ రాములు, పార్టీ కార్యదర్శి జహంగీర్ పాషాలను ఇన్చార్జులుగా నియమించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా వారు సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించనున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెలాఖరు వరకూ కొనసాగనుంది. సభ్యత్వ నమోదు అనంతరం మార్చి నెలలో గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది.
ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకమే..
ఇదిలాఉంటే, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ప్రతి నియోజకవర్గంలో 50వేలకు తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఇచ్చిన లక్ష్యానికి తగ్గకుండా సభ్యత్వ నమోదు జరిగేలా మండలాలు, గ్రామాల వారీగా లక్ష్యాలను సిద్ధం చేసుకుంటున్నారు. నమోదు పుస్తకాలు రాగానే తమ దృష్టంతా సభ్యత్వంపైనే కేంద్రీకరించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జిలను నియమించి సభ్వత్వం ఏ విఽధంగా జరుగుతోందనేది ఏరోజుకారోజు సమీక్షించనున్నారు. ఎక్కడైనా వెనకబడిఉంటే వేగం పుంజుకునేలా మార్గదర్శనం చేయనున్నారు.
నేడు వికారాబాద్ నియోజకవర్గ సమావేశం...
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని తేజ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా ఇన్చార్జి జహంగీర్ పాషా, నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు హాజరుకానున్నారు.