మోసపూరిత మాటలు నమ్మొద్దు
ABN , First Publish Date - 2021-03-06T05:14:55+05:30 IST
ఉద్యోగులు, పట్టభద్రులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దని
- మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి
షాద్నగర్రూరల్: ఉద్యోగులు, పట్టభద్రులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో పట్టభద్రులు, ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 85వేల ఉద్యోగాలు ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో 1.32లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. అంతేకాకుండా బీజేపీ దేశవ్యాప్తంగా 21రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ ఉద్యోగాల కల్పనతోపాటు రైతులకు అమలు చేస్తున్న పఽథకాల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు అయినా కట్టినట్లు చూపాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణా రాష్ట్రంలో కేవలం 8 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా నియోజకవర్గాల్లోని సాగుభూములకు కృష్ణాగోదావరి నీళ్లు పారుతాయన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ అన్నపూర్ణగా అభివృద్ధి చెందుతుందన్నారు.
మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురావాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచి చేసిందేమీలేదని విమర్శించారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్రావు ఏనాడూ జనంలోకి రాలేదన్నారు.
మంత్రి శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఉన్నత విద్యావంతురాలైన సురభి వాణీదేవిని చట్టసభలకు పంపిస్తే సమస్యలపై వాణిని వినిపిస్తారన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివా్సరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతా్పరెడ్డి, బి.కిష్టయ్య, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబల్నాయక్, జడ్పీ వైస్చైర్మన్ ఈటె గణేష్, మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్, వైస్చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.