మృతిచెందిన వ్యక్తి కళ్లు తెరిచాడని..

ABN , First Publish Date - 2021-10-22T05:18:04+05:30 IST

మృతిచెందిన వ్యక్తి కళ్లు తెరిచాడని..

మృతిచెందిన వ్యక్తి కళ్లు తెరిచాడని..

తాండూరు రూరల్‌: గుండెపోటుతో మృతిచెందాడని ఆసుపత్రిలో నిర్ధారించిన వైద్యులు వ్యక్తి మృతదేహాన్ని ఇంటికి పంపించారు. గ్రామానికి వచ్చి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా మృతిచెందిన వ్యక్తి కళ్లు తెరుచుకున్నాయి. దీంతో గమనించిన కుటుంబీకులు వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కళ్లు తెరిచిన మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎల్మకన్నె గ్రామానికి చెందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి(40) గత ఆరునెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో పది రోజుల క్రితం కడుపునొప్పి తీవ్రం కావడంతో కుటుంబీకులు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆసుపత్రి వైద్యులు ఈనెల 19వ తేదీన రాజశేఖర్‌రెడ్డికి శస్త్రచికిత్స చేశారు. 20వ తేదీన ఆసుపత్రిలోనే ఒక్కసారిగా రాజశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురై మృతిచెందాడు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని కుటుంబీకులు స్వగ్రామం ఎల్మకన్నెకు తీసుకువచ్చారు. గురువారం అంత్యక్రియల ఏర్పాటు చేస్తుండగా రాజశేఖర్‌రెడ్డి మృతదేహం కళ్లు తెరుచుకున్నాయి. నాడి కూడా కొట్టుకోవడం గమనించిన కుటుంబీకులు కోమాలో ఉండవచ్చనే అభిప్రాయంతో  ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కళ్లుతెరిచిన మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు ధృవీకరించారు. దీంతో కుటుంబీకులు తిరిగి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతిచెందిన వ్యక్తి కళ్లు తెరిచాడనే విషయం తెలుసుకున్న గ్రామస్థులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలివచ్చారు. మృతిచెందిన వ్యక్తి కళ్లు తెరవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-22T05:18:04+05:30 IST