స్తంభంపై పాము మృత్యువాత
ABN , First Publish Date - 2021-10-26T04:56:52+05:30 IST
స్తంభంపై పాము మృత్యువాత

తాండూరు రూరల్: 33కేవీ విద్యుత్ స్తంభం పైకి పాము ఎక్కడంతో రెండు గంటలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తాం డూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని బీసీ శ్మశాన వాటిక వెనుక భాగంలో 33కేవీ విద్యుత్ స్తంభంపై పాము ఎక్కడంతో ఎర్తింగ్ వచ్చి గౌతాపూర్ సబ్స్టేషన్లో ఫ్యూజ్లు అన్నీ ఎగిరిపోయాయి. దీంతో సబ్స్టేషన్ పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండూరు పట్టణ సమీపంలోని 132 కేవీ సబ్స్టేషన్ నుంచి గౌతాపూర్ గ్రామసమీపంలోని సబ్స్టేషన్కు 33కేవీ సరఫరా అవుతుంది. అయితే నాగుపాము ఒక్కసారిగా విద్యుత్స్తంభం ఎక్కడంతో విద్యుత్షాక్కు గురై మృత్యువాత పడింది. గౌతాపూర్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజ్లు ఎగిరిపోతుండటంతో విద్యుత్సిబ్బంది ప్రతి విద్యుత్స్తంభం వద్ద పరిశీలించారు. అంతారం గ్రామసమీపంలోని బీసీ శ్మశానవాటిక వెనుక విద్యుత్ స్తంభంపై కరెంటు తీగలపై మృత్యువాత పడిన పామును గుర్తించారు. లైన్మెన్ పామును తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.