అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం
ABN , First Publish Date - 2021-11-23T04:39:22+05:30 IST
షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని
- ఆందోళనలో అన్నదాతలు.. ధాన్యం కొనాలని విన్నపం
షాద్నగర్అర్బన్: షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డులోని సీసీ ప్లాట్ ఫాంపై ఆరబెట్టిన ధాన్యం పై కవర్లు కప్పినా కింది నుంచి వర్షపు నీరు పారింది. వరి ధాన్యంతోపాటు ఆరబెట్టిన మొక్కజొన్నలు సైతం తడిసిపోయాయి. షాద్నగర్ పట్టణ పరిసర గ్రామాల్లోని రైతులు తమ వ్యవసాయ పొలం వద్ద సౌకర్యం లేకపోవడంతో నూర్పిడి చేసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను మార్కెట్ యార్డులో ఆరబెట్టారు. కొన్నిరోజుల నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఎండ రాలేదు. సోమవారం ఎండ రావడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. ఆకస్మికంగా వచ్చిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన గురయ్యారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేయడంతోనే రోజుల తరబడి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరీక్షించాల్సి వస్తుందని, వర్షాలకు నష్టపోవాల్సి వస్తుందని బోరుమంటున్నారు.
మొలకెత్తిన ధాన్యం.. ఆందోళనలో అన్నదాతలు
మంచాల : ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కోటి ఆశలతో చేసిన వానాకాలం సాగు కలిసిరాక రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇక మాకు దిక్కెవరంటూ బాధిత రైతులు బోరుమం టున్నారు. గతేడాదిలాగే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురవడంతో మంచాల మండలంలో రైతులు వానాకాలం సాగును పెద్దమొత్తంలో చేపట్టారు. పంట చేతికొచ్చే సరికి ఎడతెరపి లేకుండా ముసురు వానలు కురవడంతో చేలోనే కొద్దిమేర నష్టం వాటిల్లింది. గడ్డి చేతికి రాకున్నా గింజలైనా దక్కుతాయేమోనని వరికోత యంత్రాలతో పంటను కోసి ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. కానీ నెలరోజులకుపైగా వాతావరణం మేఘావృతమై ఎడతెరి పిలేకుండా చినుకులు కురుస్తున్నాయి. దీంతో కల్లంలో పోసిన ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు సాధ్యం కాక కుప్పగానే ఉంచారు. ఫలితంగా గింజలన్నీ మొలకెత్తి కల్లాలన్నీ నారుమడులను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా మంచాల పీఏసీఎస్ డైరెక్టర్ జెనిగె వెంకటే్షయాదవ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను సత్వరమే చేపట్టి రైతులకు బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది
షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం కాస్తా కొట్టుకుపోయింది. పంట కోసిన పొలం వద్ద సౌకర్యం లేక, మార్కెట్కు తెచ్చి ఎండబెడితే వర్షానికి తడిసిపోయింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
- జె. వినోద్కుమార్, రైతు, అన్నారం తండా
ఎండబెట్టిన మొక్కజొన్నలు తడిశాయి
షాద్నగర్ మార్కెట్ యార్డులో ఎండబెట్టిన మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్కు తెచ్చిన మొక్కజొన్నలు పచ్చిగా ఉన్నాయని వ్యాపారులు చెప్పడంతో ఎండబెట్టి, నష్టపోవాల్సి వస్తున్నది. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే, వర్షాలతో మరింత నష్టపోవాల్సి వస్తున్నది.
- కొర్ర శ్రీను, రైతు, రామేశ్వరం
నెల రోజుల నుంచి మార్కెట్లోనే..
ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నెలరోజుల క్రితం 200 బస్తాల వరి ధాన్యాన్ని షాద్నగర్ మార్కెట్ యార్డుకు తెచ్చాను. ఆరబెట్టి, కుప్పలుగా పోశాను. మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చూస్తున్నాం. ప్రభుత్వ కొనుగోలు ప్రారంభం కాలేదు. వర్షపు నీరు కుప్పల కింద నుంచి పారి ధాన్యం తడిసింది.
- రాజు, రైతు, అన్నారం