ముంచేస్తున్న ముసురు

ABN , First Publish Date - 2021-11-22T04:59:29+05:30 IST

నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల

ముంచేస్తున్న ముసురు

  • అకాల వర్షాలకు పాడవుతున్న వరి, పత్తి పంటలు

ఆమనగల్లు /కడ్తాల్‌ / మాడ్గుల / యాచారం : నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల పరిధిలో చాలాచోట్ల వరి పంటలు దెబ్బతిన్నాయి. గాలి వానకు వరి పంట నేలకొరిగి వడ్లు మొలకెత్తుతున్నాయి. మరికొన్ని చోట్ల రైతులు వరి చేలు కోసి కల్లాల్లో ధాన్యం ఉంచడంతో తడిసి ముద్దవుతోంది. ముసురు వర్షాల కారణంగా చేనుపై పత్తి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు వర్షానికి దెబ్బతిని పాడవుతుండడంతో అన్నదాతలు విలవిల్లా డుతున్నారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో రైతులు వరి ధాన్యాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. కొనుగోళ్లు కూడా జరగక ధాన్యం తడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముసురు వర్షానికి పలు గ్రామీణ అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. కూరగాయల తోటలు కూడా పాడవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. 


యాచారం మండలంలో..

యాచారం మండల పరిధిలో వారంరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న జల్లులకు చేతికందిన పంటలు పాడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్కళ్లపల్లి, మేడిపల్లి, యాచారం, నందివనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ద, నజ్దిక్‌సింగారం తదితర గ్రామాల్లో పొలాల్లో ఉన్న వరి పంట పూర్తిగా నేలపాలైంది. పంట నేలవాలడంతో కోత కోయడం చాలా కష్టమని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా వర్షాల కారణంగా ఆకుకూరలకు మచ్చలు ఏర్పడుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-22T04:59:29+05:30 IST