కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2021-05-22T05:25:57+05:30 IST

కొనసాగుతున్న కరోనా ఉధృతి

కొనసాగుతున్న కరోనా ఉధృతి

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నలుగురి మృతి
  • వికారాబాద్‌లో 295, రంగారెడ్డిలో 319 మందికి పాజిటివ్‌ 
  • ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు


షాద్‌నగర్‌/కేశంపేట/కందుకూరు/ధారూరు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం కరోనాతో ముగ్గురు మృతిచెందారు. షాద్‌నగర్‌ పట్టణంలో మైనార్టీ నేతగా, ప్రముఖ వ్యాపారవేత్తగా పట్టణంలో ఆయన పేరు ప్రఖ్యాతలు పొందిన ఓ వ్యక్తి(50) కరోనాతో మృతిచెందారు. సైకిళ్ల వ్యాపారం మొదలుకుని రియల్‌ ఎస్టేట్‌, ఫక్షన్‌హాళ్ల నిర్మాణం చేపట్టి వందల మందికి ఆయన ఉపాధి కల్పించారు. ఆపద సమయంలో అత్యవసర సేవలందించిన ఆయన మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా వారం క్రితమే ఆయన తండ్రి మృతిచెందడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.  వ్యాపారి మృతిపట్ల షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మాజీ మంత్రి డాక్టర్‌ శంకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీర్లపల్లి శంకర్‌, షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ తదితరులు సంతాపం తెలిపారు. అదేవిధంగా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కేశంపేట మండలంలో ఓ దినపత్రిక (ఆంధ్రజ్యోతి కాదు) కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి(54) కరోనాబారినపడి మృతిచెందాడు. వారం రోజుల క్రితం ఆయన కరోనాబారినపడి ఇంటివద్దే ముందులు వాడుతున్నాడు. శ్వాసతీసుకోవడంతో ఇబ్బందిగా మారడంతో గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేవిధంగా కందుకూరు మండలంలోని దెబ్బడగూడ గ్రామంలో ఓ వృద్ధురాలు(60) కరోనాబారిన పడి మృతిచెందింది. నాలుగురోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్‌ రాగా నగరంలోని గాంధీ ఆసుపత్రికి మూడు రోజుల క్రితం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామంలో ఇప్పటి వరకు  ఎనిమిది మంది కరోనా సోకి మృతిచెందారు. అదేవిధంగా ధారూరు మండలంలోని మోమిన్‌కలాన్‌ గ్రామంలో ఓ వృద్ధుడు(70) కరోనాతో మృతిచెందాడు. ఈనెల 8న పాజిటివ్‌ రావడంతో తాండూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం క్షీనించడంతో ఈనెల 11న వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందించగా 20వ తేదీన డిశ్చార్జ్‌ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన శుక్రవారం మృతిచెందారు. 

వికారాబాద్‌ జిల్లాలో 295మందికి కొవిడ్‌ పాజిటివ్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)/ధారూరు/పరిగి/కొడంగల్‌/బొంరాస్‌పేట్‌/దౌల్తాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో శుక్రవారం 295 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1377 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 295 మందికి పాజిటివ్‌ వచ్చింది. పరిగి, చిట్యాలలో 89 మందికి పరీక్షలు చేస్తే 16 మందికి కొవిడ్‌ రాగా, దోమలో 46 మందిలో 11 మందికి, కులకచర్లలో 60 మందిలో 26 మందికి, పూడూరులో 104 మందికి పరీక్షలు చేయగా, వారిలో 28 మందికి కొవిడ్‌ వచ్చినట్లు గుర్తించారు. కొడంగల్‌లో 32 మందికి పరీక్షలు చేయగా, వారిలో 18 మందికి పాజిటివ్‌ రాగా, అంగడి రాయిచూర్‌లో 50 మందిలో 5 గురికి, దౌల్తాబాద్‌లో 77 మందిలో 22 మందికి, బొంరా్‌సపేట్‌లో 62 మందిలో 18 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. తాండూరులో 206 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 34 మందికి కొవిడ్‌ వచ్చింది. జిన్‌గుర్తిలో 38 మందికి పరీక్షలు చేయగా, వారిలో 4 గురికి, బషీరాబాద్‌లో 39 మందిలో 13 మందికి, నవాల్గలో 35 మందిలో 11 మందికి, పెద్దేముల్‌లో 50 మందిలో 6 గురికి, యాలాల్‌లో 30 మందిలో 7 గురికి పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌లో 40 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 5 గురికి కొవిడ్‌ రాగా, రామయ్యగూడలో 45 మందిలో 7 గురికి, సిద్దులూరులో 45 మందిలో 6 గురికి, మోమిన్‌పేట్‌లో 50 మందిలో ఇద్దరికి, మర్పల్లి, పట్లూర్‌లో 81 మందిలో 26 మందికి, కోట్‌పల్లిలో 26 మందిలో 3 గురికి, నవాబుపేట్‌లో 37 మందిలో 7 గురికి, ధారూరులో 55 మందిలో 14 మందికి, నాగసమందర్‌లో 59 మందిలో 6 గురికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, బంట్వారంలో 21 మందికి పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్‌ వచ్చింది. 

రంగారెడ్డి జిల్లాలో 319మందికి కరోనా పాజిటివ్‌ 

షాద్‌నగర్‌ రూరల్‌/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల/కందుకూరు/శంషాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌/మాడ్గుల/తలకొండపల్లి/ఆమనగల్లు/యాచారం: రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 319 మందికి కరోనా పాజిటివ్‌ విచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. షాద్‌నగర్‌ డివిజన్‌లో అత్యధికంగా 374మందికి టెస్టులు చేయగా 102మందికి పాజిటివ్‌గా తేలినట్లు షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దామోదర్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నంలో 361 టెస్టులు చేయగా 91మందికి పాజిటివ్‌ వచ్చింది. చించోడులో ఐదుగురికి, బూర్గులలో ఆరుగురికి, కొందుర్గులో 11మందికి, కేశంపేటలో ఏడుగురికి, కొత్తూరులో ఎనిమిది మందికి, నందిగామలో నలుగురికి, సీహెచ్‌సీ షాద్‌నగర్‌ 23మందికి, ఆర్‌టీపీసీఆర్‌లో 38మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వివరించారు. చేవెళ్ల డివిజన్‌లో మొత్తం 195 మందికి టెస్టులు చేయగా 41మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చేవెళ్ల మండలంలో 75 మందికి గానూ 15మందికి, షాబాద్‌లో 46మందిలో 11మందికి, శంకర్‌పల్లిలో శంకర్‌పల్లిలో 49మందిలో ఏడుగురికి, మొయినాబాద్‌ మండలంలో 25మందిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కందుకూరులోని పీహెచ్‌సీలో శుక్రవారం 36మందికి కరోనాపరీక్షలు నిర్వహించగా 13మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని పీహెచ్‌సీలో శుక్రవారం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 75మందికి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు. పెద్దషాపూర్‌లో 13మందికి, నర్కోడలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు పీహెచ్‌సీ కేంద్రాల్లో 60మందికి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్లు  తెలిపారు. మాడ్గుల మండలం కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం 43మందికి కరోనాపరీక్షలు చేయగా 15మందికి పాజిటివ్‌గా తేలిందని డాక్టర్‌ లలిత తెలిపారు. తలకొండపల్లి, గట్టిప్పలపల్లి పీహెచ్‌సీల్లో 61మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు శారద, అజీంలు తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో 43మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 17మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ శ్రీకాంత్‌, ఎంపీహెచ్‌వో తిరుపతిరెడ్డి తెలిపారు. యాచారంలో 26మందికి టెస్టులు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


కరోనా బాధితులకు ఆపన్న హస్తం

కందుకూరు:  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన హరిజోన్‌వ్యాలీ ఇన్ఫో ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు కరోనా బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, సిలిండర్లను అందజేసి ప్రాణాలను కాపాడుతున్నారు. గత 20రోజులుగా సుమారు వందమందికి పైగా ఉచితంగా సిలిండర్లను అందజేస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో రూ.7లక్షల విలువ గల  ఎనిమిది ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేశారు. అదేవిధంగా రూ.5లక్షలు విలువ చేసే 13 సిలిండర్లను కొనుగోలు చేసి కందుకూరు పరిసర గ్రామాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎండీ అసీఫ్‌ మాట్లాడుతూ కరోనా కట్టడికి తమవంతు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత ఉన్న వారు సిలిండర్ల కొరకు 9666745556, 6281698251 , 9391955682 నెబర్లను సంప్రదించాలని తెలిపారు. 

ఆసుపత్రికి ఐదు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేత 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): కొవిడ్‌ బాధితులకు సాయమందించేందకు అందరూ ముందుకు రావాలని యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి కోలుకుంద సంతోష్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయన మా శారద ఆసుపత్రికి ఐదు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రాజశేఖర్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బాదం అశోక్‌, దుద్యాల లక్ష్మణ్‌, రాజశేఖర్‌రెడ్డి, ప్రమోద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T05:25:57+05:30 IST