నెలాఖరు నాటికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-12-09T04:34:17+05:30 IST
నెలాఖరు నాటికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
![నెలాఖరు నాటికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921120811014174/12082021230357n76.jpg)
తాండూరు: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చే సేందుకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి గ్రామాల్లో దండోరా వేయాలని కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణం కన్యపాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెలాఖరు నాటికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో అనుకున్నంత వేగంగా పనులు జరుగకపోవడంపై కలెక్టర్ సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్లో తక్కువగా జనాలు ఉండటం, వ్యాక్సినేటర్లు లేకపోవడంతో సంబంధిత సెంటర్ ఇన్చార్జీ డాక్టర్ భాస్కర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టీకా వేసుకోని వారిని సూపర్వైజర్లు సెంటర్లకు తీసుకురావాలని రోజూ వారీగా వ్యాక్సినేషన్ ఎంత మందికి వేస్తున్నారో అట్టి వివరాలు, ఫొటోలు తన మొబైల్కు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీవో అశోక్కుమార్, ప్రత్యేకాధికారి హన్మంత్రావు, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తదితరులున్నారు.
కొవిడ్ టీకా తీసుకోనివారికి ప్రభుత్వ పథకాలు రద్దు: డీఎల్పీవో అనిత
మర్పల్లి: కరోనా టీకా తీసుకోనివారికి ప్రభుత్వ పథకాలు రద్దవుతాయని డీఎల్పీవో అనిత అన్నారు. బుధవారం మర్పల్లిలో కరోనా టీకా వేయించుకోని వారి వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొవిడ్ టీకా పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోరాదన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. ఎవరైనా టీకా వేసుకోని లబ్ధ్దిదారులుంటే గుర్తించి వారికి నిత్యావసర సరుకులతో పాటు పింఛన్ కూడా ర్జద్దు చేస్తామన్నారు. ఆమె వెంట ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్, ఏఎన్ఎం రహిసా, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.