కోలువాగు కబ్జాచేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-02-27T04:58:09+05:30 IST
కోలువాగు కబ్జాచేస్తే చర్యలు

- ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన అధికారులు
కందుకూరు: మండల పరిధిలోని దెబ్బడగూడలో గల చింతల్ చెరువు కోలువాగుపై అక్రమనిరాణాలను చేపడితే చర్యలు తప్పవని ఇరిగేషన్ ఏఈ నర్సయ్య హెచ్చరించారు. ఈనెల 14న ‘దెబ్బడగూడ చింతల్ చెరువు కోలువాగు కబ్జా’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అల్లీఖాన్పల్లి రెవెన్యూలో ప్రారంభమయ్యే వాగు మహ్మద్నగర్ రెవెన్యూ మీదుగా దెబ్బడగూడ చింతల్ చెరువులోకి పూర్వం నుంచి వర్షంనీరు వస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో పాటు వాగుపై గతంలో చెక్డ్యాంలు నిర్మించినప్పటికీ వాటిని ధ్వంసం చేసి చేపట్టిన గోడ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలన్నారు. దీనికి సంబంధిత రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వర్రావుకు ఫోన్ ద్వారా పనులను నిలిపివేయాలని సమాచారం ఇచ్చారు. చెక్డ్యాంను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదుకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి పాల్గొన్నారు.