అనంతగిరి టీబీ ఆసుపత్రిలో జేడీ విచారణ

ABN , First Publish Date - 2021-09-30T04:27:27+05:30 IST

అనంతగిరి టీబీ ఆసుపత్రిలో జేడీ విచారణ

అనంతగిరి టీబీ ఆసుపత్రిలో జేడీ విచారణ
అనంతగిరి టీబీ ఆసుపత్రిలో విచారణ చేస్తున్న జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం

  • అక్రమ పదోన్నతులు, కారుణ్య నియామకాలు, 
  • సామగ్రి మాయంపై ఆరా 

వికారాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అనంతగిరి ప్రభుత్వ క్షయ, ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర టీబీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం బుధవారం విచారణ నిర్వహించారు. అనంతగిరి క్షయ ఆసుపత్రి భవనాలు, వసతి, నివాసగృహాలకు సంబంధించిన తలుపులు, కిటికీలతో పాటు మ్యాన్‌హోల్‌ కవర్లు, కాస్ట్‌ ఐరన్‌ పైపులు, కాపర్‌ తీగలను అక్రమంగా విక్రయించిన సంఘటనలపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన విచారణ జరిపారు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకాలు, అక్రమ పదోన్నతులపై వచ్చిన ఆరోపణలపై ఫిర్యాదుదారు అబీద్‌తో పాటు పలువురిని వ్యక్తిగతంగా విచారించారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అధికారం లేకున్నా 18 మందిని అక్రమంగా నియమించారని, రోస్టర్‌ నిబంధన పాటించకుండా పలువురికి అక్రమంగా పదోన్నతులు కల్పించారన్న ఆరోపణలపై కూడా ఆయన విచారణ జరిపారు. విచారణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆయన మరోసారి విచారణ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

డీఎంహెచ్‌వో కార్యాలయంలోనూ విచారణ

ఇదిలా ఉంటే, జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ సాయిబాబా ఇంతకుముందు డిప్యూటీ డీఎంహెచ్‌వోగా కొనసాగిన సమయంలో వచ్చిన ఆరోపణలపైౖ రాష్ట్ర టీబీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై ఆయన విచారణ చేయగా, తనకు ఏ సంబంధం లేకున్నా తనను ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని బాధిత అధికారి జేడీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. 

Updated Date - 2021-09-30T04:27:27+05:30 IST