షాద్నగర్లో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-06-18T05:33:46+05:30 IST
షాద్నగర్లో భారీ వర్షం
షాద్నగర్/కేశంపేట: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. అరగంటకుపైగా వర్షం కురిసింది. ఈ వర్షంతో దున్నుకానికి అదును వచ్చినట్టయింది. చాలా గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న, జొన్న లాంటి విత్తనసాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
- యాచారంలో మోస్తరు వర్షం
యాచారం: యాచారం, తక్కళ్లపల్లి, మేడిపల్లి, మల్కీజ్గూడ తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం మో స్తరు వర్షం కురిసింది. దీంతో 20 రోజుల క్రితం వేసిన కంది, జొన్న, పత్తి పంటలకు లాభం చేకూరిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- పరిగిలో చిరు జల్లులు
పరిగి/దౌల్తాబాద్: పరిగి సబ్డివిజన్లో గురువారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. అకాశం మేఘావృత మై భారీ వర్షం కురిసేట్లు కనిపించినా, చిరు జల్లులతోనే సరిపెట్టింది. దోమలో మాత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. పరిగి, పూడూరులో చిన్నపాటి చినుకులు మాత్రమే పడ్డాయి. దౌల్తాబాద్ మండలం దేవరఫస్లాబాద్, గోకఫస్లాబాద్, దౌల్తాబాద్ గ్రామాల్లో సాయంత్రం గంటపాటు వర్షం కురవడంతో పంటపొలాల్లో నీరు నిలిచింది. వానాకాలం సీజన్లో సాగుకోసం విత్తనాలు విత్తిన రైతులు పంట పొలాల్లో నీరు నిలిచి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. కాగా మండలాల్లోని వాగులు, వంకలు వర్షపు నీటితో పొంగిపొర్లాయి.