జలమయం
ABN , First Publish Date - 2021-10-18T04:36:16+05:30 IST
జలమయం
- వరద నీటిలోనే స్వర్ణగిరి, యాదాద్రినగర్ కాలనీలు
- నారపల్లి వద్ద హైదరాబాద్-వరంగల్ హైవేపై నీరు
ఘట్కేసర్: ఘట్కేసర్ మండలంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చౌదరిగూడ పంచాయతీలోని స్వర్ణగిరి, యాదాద్రినగర్ కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎగువన చెంగిచెర్ల, బోడుప్పల్లో కురిసిన భారీ వర్షంతో దిగువన ఉన్న పోచారం మున్సిపాలిటీ, చౌదరిగూడ పంచాయతీలోని రెండు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. పోచారం మున్సిపాలిటీపరిధిలోని నారపల్లి వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి నుంచి వరద నీటిలోనే గడుపుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. మరోవైపు డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో కనీసం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షం కురిసినప్పుడల్లా ఎగువ ప్రాంతం నుంచి కాలనీల్లోకి వరద నీరు చేరుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.