రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

ABN , First Publish Date - 2021-10-22T05:17:11+05:30 IST

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

వికారాబాద్‌: గత యాసంగిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరిధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో  గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పీఏసీఎస్‌, ఐకేపీ, డీసీఎంఎస్‌, మార్కెటింగ్‌ శాఖల ద్వారా 192కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి జిల్లాలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. నవంబర్‌ 15 నుంచి 70 రోజులలో వరిధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.  రైతులకు 24గంటల లోపు చెల్లింపులు జరిగే విధంగా రైతుల ఆధార్‌, బ్యాంకు ఖాతా నెంబర్‌ వివరాలను ఆన్‌లైన్‌లో సరిగా నమోదు చేయాలని సూచించారు. మేలురకం వరిధాన్యానికి ప్రభుత్వం నిర్ధేశించినట్లు రూ.1960, సాధారణ రకం రూ.1940 లు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రషీద్‌, డీసీఎస్‌వో రాజేశ్వర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్‌, డీఎం సివిల్‌ సప్లయ్‌ విమల, డీసీవో సుజాత, అదనపు డీఆర్డీవో నర్సిములు, డీసీఎంఎస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ కృష్ణారెడ్డి, విఠల్‌నాయక్‌, ఆర్‌ఐలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-22T05:17:11+05:30 IST