ప్రమాదకరంగా మలుపులు

ABN , First Publish Date - 2021-12-27T05:07:58+05:30 IST

ప్రమాదకరంగా మలుపులు

ప్రమాదకరంగా మలుపులు
గ్యాస్‌గోదాం వద్ద మలుపులో పిచ్చిమొక్కలు, కంపచెట్లు

బషీరాబాద్‌: పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారుల్లో మూలమలుపుల వద్ద  ఇరువైపుల కంపచెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బషీరాబాద్‌-తాండూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో మైల్వార్‌-ఎక్మాయి మధ్య రోడ్డు, హెచ్‌పీ గ్యాస్‌ ఎజెన్సీ వద్ద, మాసన్‌పల్లి గేటు సమీపంలో, గొట్టిగఖుర్దు-కాశీంపూర్‌ రహదారిలో , ఎన్కెపల్లి గేట్ల దగ్గర పెద్ద మలుపులతో పాటు వివిధ గ్రామాలు, గిరిజన తండాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపు కంపచెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో దారి కనిపించక తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల అల్లాపూర్‌- దామర్‌చెడ్‌ వద్ద ప్రధాన మలుపులో కంపచెట్లు పెరగడంతో దారి కనిపించక ఇటీవల ఓ రైతును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కాలు విరిగి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన మరువకముందే గత బుధవారం బషీరాబాద్‌ ప్రధాన రోడ్డులో గ్యాస్‌ గోదాం సమీప మలుపులో కంపచెట్లతో ఎదురుగా వస్తున్న బైక్‌ కనిపించక రెండు బైకులు ఢీకొట్టుకుని మంతన్‌గౌడ్‌తండాకు చెందిన రథోడ్‌రమేష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి  తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఈ రోడ్డులో ఎక్కడా కూడా సూచిక బోర్డులు లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ద్విచక్ర వాహనదారులు, కార్లు, జీపులు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం ఈ మార్గంలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి మలుపుల్లో కంపచెట్ల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-27T05:07:58+05:30 IST