ఏకగ్రీవం.. ఏం లాభం?
ABN , First Publish Date - 2021-12-16T04:39:21+05:30 IST
గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏక గ్రీవంగా ఎన్నికైతే ప్రోత్సాహక
- అందని ప్రభుత్వ నజరానా
- నిర్వేదంలో సర్పంచ్లు.. పట్టించుకోని సర్కార్
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 135 పంచాయతీలు
- నిధుల కోసం ఏకగ్రీవ సర్పంచ్ల ఎదురుచూపులు
గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏక గ్రీవంగా ఎన్నికైతే ప్రోత్సాహక నిధులు వస్తాయని ఆశించిన ఏకగ్రీవ సర్పంచులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధులతో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. పంచాయతీల పాలకవర్గాలు ఏర్పాటై రెండేళ్లు దాటినా ప్రోత్సాహక నజరానా అందని ద్రాక్షలా మారింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి ప్రోత్సాహక నిధులను విడుదల చేయాలని సంబంధిత సర్పంచులు, ప్రజలు కోరుతున్నారు.
(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్) : గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పంచా యతీని ఏకగ్రీవం చేసు కుంటే ప్రోత్సాహక నిధు లొస్తాయనే ఆశతో, ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో పెద్ద ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రభుత్వం అందించే నజరానాతో గ్రామంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు చేపట్ట వచ్చని భావించిన గ్రామపెద్దలు, యువత, మహిళా సంఘాల సభ్యులతో సమన్వయం చేసు కుని వార్డుసభ్యులు, ఉపసర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు సర్పంచి ఎన్నికలు నిర్వ హించి ఫిబ్రవరి 2న పాలకవర్గం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్న పంచాయ తీలకు రూ.10లక్షలు, పెద్దపంచాయతీలకు రూ.15లక్షల ప్రోత్సాహక బహుమతి ప్రకటించింది. ఈ నిధులతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని ఆశించినా సర్పంచులకు నిరాశే ఎదురైంది. రెండేళ్లు దాటినా పంచాయతీలకు కేటాయించిన నజరానా అందక పోవడంతో ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నా అవి చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,187 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 135 పంచాయతీల్లో పాలక వర్గాలను ఎన్నికలు లేకుండా ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. దీంతో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలో మొత్తం 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2019, జనవరిలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో 23, కొడంగల్ నియోజకవర్గంలో 19, వికారాబాద్ నియోజకవర్గంలో 18, తాండూరు నియోజకవర్గంలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికెన పంచాయతీల పాలకవర్గాలు అదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కొలువుదీరగా, ఏకగీవ్రంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ఒక్కో పంచా యతీకి రూ.10 లక్షల నిధులకు అదనంగా మరో రూ.5 లక్షలను అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిఽధుల్లో నుంచి కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.7లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తే.. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రోత్సాహకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. జిల్లాలో ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల వంతున ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం రూపంలో రూ.7.50 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.5 లక్షల వంతున మరో రూ.3.75 కోట్లు ఏకగ్రీవ పంచాయతీలకు అందాల్సి ఉంది. అయితే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఏకగ్రీవ పంచాయతీలకు నిరాశ తప్పడం లేదు.
ప్రోత్సాహక డబ్బులు ఇంకా రాలేవు
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నజరానా అంద జేయనున్నట్లు ప్రకటిం చింది. రెండేళ్లయినా నేటికీ ప్రోత్సాహక డబ్బులు రాలేవు. డబ్బులు త్వరగా వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతా. ప్రభుత్వం స్పందించి తొందరగా నిధులు మంజూరు చేయాలి.
- లక్ష్మీబాయి, ఏక గ్రీవ సర్పంచ్, రంగాపూర్, పరిగి మండలం.
పార్టీ ఫండ్ ఇస్తామని ఇవ్వలేదు
గ్రామ పంచాయతీని ఏక గ్రీవం చేస్తే ఎమ్మెల్యే నిధు లతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి రూ. 25 లక్షలు ఇస్తామని పార్టీ నేతలు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ.. డబ్బులు ఇప్పించలేదు. ప్రభుత్వం ఇచ్చే నజరానా కూడా రాలేదు. డబ్బులు రాకపోవడతో పంచాయతీ పాలక వర్గం నిరాశలో ఉంది.
- పస్కుల నర్సింహులు, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్
ఒక్క పైసా రాలే
రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామ పంచాయ తీలకు నజరానా ప్రకటించి రెండేళ్లు దాటింది. నేటివరకు ఒక్క పైసా ఇవ్వలేదు. నజరానా వస్తే గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేద్దామనుకున్నాం. గ్రామాభివృద్ధికి చేతి నుంచి డబ్బులు ఖర్చుపెడుతున్నాను. నజరానా ఇవ్వాలని పలు మార్లు వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నో సమస్యలు ఉన్న గ్రామాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- రాములు నాయక్, ఏకగీవ్ర సర్పంచ్, గిరి రాయపల్లి తండా, ఫరూక్నగర్ మండలం
ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇస్తాం
నజరానా డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అందజేస్తాం. రంగారెడ్డి జిల్లాలో 560 పంచాయతీలు ఉండగా ఇందులో 53 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమ య్యాయి. ప్రోత్సాహక నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు.
- శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు
జిల్లా మొత్తం ఏకగ్రీవం
వికారాబాద్ 566 75
రంగారెడ్డి 560 53
మేడ్చల్ 61 07
మొత్తం 1,187 135