కూల్చివేతలపై చిరు వ్యాపారుల ఆందోళన

ABN , First Publish Date - 2021-08-22T04:26:14+05:30 IST

కూల్చివేతలపై చిరు వ్యాపారుల ఆందోళన

కూల్చివేతలపై చిరు వ్యాపారుల ఆందోళన
బాధిత చిరు వ్యాపారులు

మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ 3వ వార్డు, జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన హోటళ్లు, డబ్బాలను కూల్చివేయడంతో శనివారం చిరువ్యాపారులు ఆందోళన నిర్వహించారు. కాగా, దాదాపు 20 సంవత్సరాలుగా జాతీయ రహదారి పక్కన ఆంతం విల్లాస్‌ సమీపంలో పలువురు చిరువ్యాపారులు చిన్నపాటి హోటళ్లు, డబ్బాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు మున్సిపల్‌ అధికారులు జేసీబీతో తొలగించారు. సమాచారం అందుకున్న చిరువ్యాపారులు తమ జీవనోపాధిని కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 3వ వార్డు కౌన్సిలర్‌ మా వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిందని, మేము డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమపై కక్షతో కూల్చివేతలు చేపట్టారని, కౌన్సిలర్‌కు అనుకూలంగా ఉన్నవాటిని మాత్రం తొలగించలేదని ఆరోపించారు. 3 నెలల ముందు నుంచే చెప్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కూడా సమాచారం ఇచ్చామని, ఇందులో రాజకీయాలకు తావు లేదని తెలిపారు.

Updated Date - 2021-08-22T04:26:14+05:30 IST