దత్తత గ్రామాల్లో పనులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2021-08-26T05:28:57+05:30 IST
దత్తత గ్రామాల్లో పనులను వేగవంతం చేయండి

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో పనులను వేగవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి ఇన్చార్జి కలెక్టర్ హరీష్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం దత్తత గ్రామాలైన మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఇప్పటివరకు పూర్తైన పనులు, పెండింగ్లో ఉన్న పనులు ఏమిటనే విషయంపై పంచాయతీరాజ్, రోడ్డు భవనాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దత్తత గ్రామాల్లో ప్రణాళికలు ఎంతమేరకు వచ్చాయి? ప్రజలు ఎదుర్కొంటున్న సమ్యలు ఏమిటి? అనే విషయంపై అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టడానికి జిల్లా వైద్య యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి మల్లిఖార్జున్, డీపీవో రమణమూర్తి, డీఈవో ప్రసాద్, పీడీ ఝాన్సీ పాల్గొన్నారు.