ప్రజావాణికి వినతుల వెల్లువ
ABN , First Publish Date - 2021-06-22T05:39:01+05:30 IST
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మొదటి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున వచ్చారు.
నిజామాబాద్ అర్బన్, జూన్ 21: లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మొదటి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తేనే పరిష్కారం అవుతాయని భావించి ప్రజలు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. కొన్ని ఫిర్యాదులను కలెక్టర్ నేరుగా స్వీకరించగా మరికొన్నింటిని అధికారులు స్వీకరించారు. కొవిడ్ విధుల నుంచి కేజీబీవీ ఏఎన్ఎంలను రిలీవ్ చేయాలని కోరుతూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని కేజీబీవీల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలు ఏప్రిల్ 26 నుంచి వివిధ పీహెచ్సీలలో విధులు నిర్వహిస్తున్నారని వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రొత్సాహకం అందడంలేదని జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా వీరికి కొవిడ్ విధుల నుంచి రిలీవ్ చేయాలని సంఘ నాయకులు సుధాకర్ కోరారు. పెన్షన్ ట్రెజరీ ఆఫీస్ను నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్కు తరలించవద్దని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. పెన్షనర్లకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ఉంచాలని కోరారు.