నిలిచిన రవాణా సేవలు
ABN , First Publish Date - 2021-05-21T04:27:50+05:30 IST
నిత్యం వందల మందితో కిటకిటలాడే జిల్లా రవాణా కార్యాలయం వెలవెలబోతోంది. ప్రతీరోజు వివిధ పనుల కోసం జిల్లాకేంద్రంలోని నాగారంలోని ఆర్టీఏ కార్యాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దానికి తోడు దాదాపు ఓ 50 మంది వరకు బ్రోకర్లు సైతం రవాణా కార్యాలయంలో హడావుడిచేస్తుంటారు. కార్యాలయానికి వందల సంఖ్యలో కొత్త, పాత వాహనాలతో కళకళలాడుతుండేది. అటువంటి ఆర్టీఏ కార్యాలయం వెలవెల బోతోంది. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో కార్యాలయంలో సేవలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈనెల 12 నుంచి కార్యాలయం మూసివేశారు.

లాక్డౌన్తో జిల్లా ఆర్టీఏ కార్యాలయం మూసివేత
పనిచేయని వెబ్సైట్లు
అంతర్గత పనులు చేస్తున్న ఏవీఐఎంలు
లారీల కొరతపై దృష్టిపెట్టిన డీటీసీ
ఆఫీస్ వద్ద లేని సమాచార బోర్డులు
నిత్యం తిరిగిపోతున్న జనం
నిజామాబాద్ రూరల్, మే 20: నిత్యం వందల మందితో కిటకిటలాడే జిల్లా రవాణా కార్యాలయం వెలవెలబోతోంది. ప్రతీరోజు వివిధ పనుల కోసం జిల్లాకేంద్రంలోని నాగారంలోని ఆర్టీఏ కార్యాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దానికి తోడు దాదాపు ఓ 50 మంది వరకు బ్రోకర్లు సైతం రవాణా కార్యాలయంలో హడావుడిచేస్తుంటారు. కార్యాలయానికి వందల సంఖ్యలో కొత్త, పాత వాహనాలతో కళకళలాడుతుండేది. అటువంటి ఆర్టీఏ కార్యాలయం వెలవెల బోతోంది. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో కార్యాలయంలో సేవలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈనెల 12 నుంచి కార్యాలయం మూసివేశారు. ప్రధాన గేట్కు తాళం వేసి ఉంచారు. ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న దాదాపు 30 ఏజెంట్ల దుకాణాలు సైతం మూసి ఉంచారు.
రోజు 200 వరకు సేవలు..
ప్రతీరోజు 200 మంది వరకు వివిధ సేవలు వినియోగించుకునేందుకు కార్యాలయానికి వచ్చేవారు. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, రెన్యూవల్, పన్నులు, వాహనాల ఫిట్నెస్ తదితర సేవల కోసం కార్యాలయంలో బారులు తీరేవారు.
వెబ్సైట్స్ క్లోజ్..
రవాణా సేవల కోసం కేటాయించి ప్రభుత్వ వెబ్సైట్ తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం అన్ని కార్యాకలాపాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాబట్టి వెబ్సైట్ క్లోజ్ కావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రతీరోజు చేసే పనులన్నీ వెబ్సైట్లో నమోదు చేయాలి. ఆన్లైన్ ద్వారానే అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. అధికారులు కేవలం ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే. వారి అకౌంట్ ద్వారా సేవలు జరుగుతాయి. వెబ్సైట్స్ తెరుచుకోకపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి.
అంతర్గత పనులకే పరిమితం..
రవాణా కార్యాలయంలో పనిచేసే ఏవీఎం, ఎంవీఐలు కేవలం కార్యాలయ పనులను మాత్రమే చేస్తున్నారు. పెండింగ్ పనులు, రికార్డుల పరిశీలన, వాటిని అప్డేట్ చేయడం, కోర్టు కేసులు, వాహనాల సీజ్ వంటి పనులు చేస్తున్నారు. సిబ్బంది మొత్తం ఇంటికే పరిమితం అయ్యారు. ప్రతీరోజు ఇద్దరు ఎంవీఐలు కార్యాలయానికి వచ్చి పనులు చేస్తున్నారు.
వెనుతిరిగిపోతున్న జనం..
లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మార్పుచేశారు. 33 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆర్టీఏ సేవలు జరగడం లేదు. ఆర్టీఏ పనుల కోసం ప్రతీరోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పదుల సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్టీఏ సేవలు జరగడం లేదన్న బోర్డు, సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ప్రజలు అక్కడికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేయాలి. ప్రధాన గేట్కు వేసిన తాళంకూడా తీయడం లేదు. అక్కడ ఎలాంటి బోర్డు కూడా ఉంచకపోవడంతో అసలు ఆర్టీఏ కార్యాలయ సేవలు ఉన్నాయో లేవో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రవాణా అధికారులు కార్యాలయ సేవలు ఈ నెల 30 వరకు ఉండబోవని బోర్డు పెడితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
లారీల కొరతపై దృష్టిపెట్టాం: డీటీసీ
లాక్డౌన్ కారణంగా ఈనెల 12 నుంచి 30 వరకు రవాణా సేవలు నిలిచిపోయాయని డీటీసీ కె.వెంకటరమణ తెలిపారు. ఆర్టీఏ ఆన్లైస్ సేవలు బంద్ అయ్యాయని, ప్రస్తుతం ధాన్యం కోసం కావలసిన లారీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయని తెలిపారు. ఈ నెల 31 నుంచి రవాణా సేవలు తిరిగి కొనసాగనున్నట్లు చెప్పారు.