మొక్కలను పెంచారు.. వదిలేశారు!

ABN , First Publish Date - 2021-08-11T04:59:36+05:30 IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది.

మొక్కలను పెంచారు.. వదిలేశారు!
కృష్ణాజీవాడి నర్సరీలో మొక్కల మధ్య పెరిగిపోయిన గడ్డి

నామ మాత్రంగా హరితహారం
నర్సరీల్లోనే మగ్గుతున్న మొక్కలు
పట్టించుకోని అధికారులు

తాడ్వాయి, ఆగస్టు 10: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలలో గడ్డి పేరుకపోయి ఉంది. నర్సరీ అంతా గడ్డి పేరుకపోయి అధ్వానంగా కనిపిస్తోంది. గడ్డిని తొలగించే వారు కరువవడంతో మొక్కలు పెరగడం లేదు. ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటాల్సి ఉంది. కానీ అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం పూర్తిగా నిర్ల్యక్ష్య ధోరణిలో నర్సరీలోని మొక్కలను నాటకుండానే వదిలేశారు. ప్రభుత్వం నర్సరీలలో మొక్కలు పెంచడానికి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మొక్కలు పెంచడంలో అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా పై అధికారులు ఆచరణలో మాత్రం పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణాజీవాడి నర్సరీలో గత సంవత్సరం సైతం మొక్కలు పెట్టకుండానే నర్సరీలోనే వదిలేశారు. గతంలోనూ ‘ఆంధ్రజ్యోతి’ నిర్లక్ష్య వైఖరిపై కథనాలు ప్రచురిస్తే పై అధికారుల కంటపడకుండా మొక్కలను మొత్తం దున్ని వేశారు. ఈ సంవత్సరం సైతం మొక్కలు పెంచి అలాగే వదిలేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నర్సరీలోని మొక్కల్లో పేరుకపోయిన గడ్డిని తొలగించి మొక్కలను నాటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-08-11T04:59:36+05:30 IST