సైబర్‌ క్రైమ్‌ పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-11-28T05:54:20+05:30 IST

ప్రజలు సైబర్‌ క్రైమ్‌ పట్ల జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని, సైబర్‌ నేరాలు చేసే మోసగాళ్ల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సీపీ కార్తికేయ అన్నారు

సైబర్‌ క్రైమ్‌ పట్ల జాగ్రత్తలు తప్పనిసరి


 కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ
ఖిల్లా, నవంబరు 27 : ప్రజలు సైబర్‌ క్రైమ్‌ పట్ల జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని, సైబర్‌ నేరాలు చేసే మోసగాళ్ల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సీపీ కార్తికేయ అన్నారు. నగరంలోని 5వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం కమ్యూనిటీ కాంట్రాక్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా నగరంలోని 5వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సాయినగర్‌ రోడ్డు నెంబరు-3 కాలనీలో సుబారు 126 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. వాహనాలకు తనిఖీ చేశారు. వాహన పత్రాలపై ఆరా తీశారు. అనంతరం పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పకుండా ధరించాలన్నారు. ఎలాంటి పరిచయం లేని వ్యక్తిఆన్‌లైన్‌ ద్వారా సమాచారం అడిగితే ఎవరికీ ఇవ్వొదన్నారు. పిల్లలకు ఫోన్‌లు, వాహనాలు ఇవ్వరాదన్నారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో సమాచారం ఇవ్వరాదని సూచించారు. లక్కీడ్రా పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వరాదన్నారు. ఎవరు కూడా ఆన్‌లైన్‌ ఫ్రాడింగ్‌ మోసాలకు గురి కావద్దన్నారు. ఎవరైనా మోసాలకు గురైతే వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు సంప్రదించాలన్నారు. లేదా డయల్‌ 100కుగానీ 155260కు సంప్రదించాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తికి ఇల్లు అద్దెకు ఇవ్వొన్నారు. అద్దెకు ఇచ్చే సమయంలో వారికి చెందిన పూర్తి వివరాలను సేకరించుకోవాలన్నారు. అనుమానం ఉంటే పోలీసు శాఖకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని, వాటి ద్వారా నేరస్తులను గుర్తించడానికి వీలుంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు  కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు స్వామి, నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:54:20+05:30 IST