వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
ABN , First Publish Date - 2021-10-29T05:38:50+05:30 IST
రెంజల్(నవీపేట), అక్టోబరు 28 : జిల్లాలో నవంబరు 3వ తేదీలోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
రెంజల్(నవీపేట), అక్టోబరు 28 : జిల్లాలో నవంబరు 3వ తేదీలోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.రెంజల్ మండలంలోని కందకుర్తి, సాటాపూర్, పేపర్మిల్ గ్రామాలలో గురువారం పర్యటించిన ఆయన వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 25 శాతం వ్యాక్సినేషన్ను నవంబరు 3లోగా పూర్తి చేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, వ్యాక్సినేషన్పై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. కరోనా మొదటి, రెండో వేవ్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని, మూడో వేవ్ రావద్దని కోరుకుంటున్నామని అన్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసును తప్పకుండా తీసుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 8లక్షల 10 వేల మందికి వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆరోగ్యం బాగాలేకుంటే వ్యాక్సినేషన్ తీసుకోకూడదన్న అపోహ ఉందని, ఆరోగ్యం బాగా లేని వారు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా ముందుకు సాగాలన్నారు. కందకుర్తి గ్రామం వందశాతం వ్యాక్సినేషన్ గ్రామంగా నిలవాలని, కందకుర్తిని ఇతర గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో గోపాలకృష్ణ, మెడికల్ ఆఫీసర్ క్రిస్టినా, సర్పంచ్లు మిర్జా కలీంబేగ్, ఎకార్పాషా, తదితరులు పాల్గొన్నారు.