పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతున్న నిజాంసాగర్
ABN , First Publish Date - 2021-10-21T04:54:55+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది.

నిజాంసాగర్, అక్టోబరు 20: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. దీంతో వారం రోజులుగా కొనసాగిన వరద గేట్ల ఎత్తివేతను బుధవారం మూసి వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 6,300 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో జెన్కో గేట్ల ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ పూర్తి నీటి సామర్థ్యం 1,405 అడుగులకు గాను 1,404.98 అడుగుల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను 17.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మూసివేసి నిజాంసాగర్ ప్రాజెక్టులో తక్కువగా ఉన్న 1000 ఎంసీహెచ్సీల నీటిని నిల్వ చేయనున్నట్లు డిప్యూటీ ఈఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. నిజాంసాగర్ వరద గేట్లను మూసి వేయడంతో మత్స్య కార్మికులు అచ్చంపేట, నిజాంసాగర్, బంజాపల్లి గ్రామాల ప్రజ లు చేపల కోసం వరద గేట్ల కింద భాగానికి పరుగులు తీశారు. వరద గేట్లు మూసివేయంతో గేట్ల దిగువన చేపలను వేటాడారు. వేటాడిన చేపలను కిలో వంద నుంచి 150 రూపాయల వరకు విక్రయించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం కలిగి ఉండటంతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలా డుతుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని చూసి పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.