ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ABN , First Publish Date - 2021-09-18T05:20:16+05:30 IST
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలు పార్టీల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలు పార్టీల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. నిర్మల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొననున్న కార్యక్రమానికి వెళ్తూ మార్గమాధ్యలో ఆయన విగ్రహం వద్ద నివాళ్లు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి వల్లభాయిపటేల్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో, రజాకారుల ఆకృత్యాలకు విసిగి పోయిన ప్రజల తిరుగుబాటుకు బాసటగా నిలిచి వారికి విముక్తి కల్పించేందుకు వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో చేపట్టి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రకటించిన ప్రస్తుత ముఖ్యమంతి కేసీఆర్ తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎంకు తలొగ్గి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్, కౌన్సిలర్లు శ్రీకాంత్, నరేందర్, శ్రీనివాస్, రవి, నాయకులు ఎంజీ వేణుగోపాల్గౌడ్, సురేష్, భరత్, వేణు, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తబస్టాండ్ వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా విమోచన దినోత్సవంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ మోహన్, ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజయ్, ఖలీల్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.
శబరిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు
తాడ్వాయి : మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్లో జరిగే సభకు వెళ్తూ మార్గమద్యలో తాడ్వాయిలో శబరిమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. అమ్మవారి సమాధిని దర్శించుకుని, ఆలయ ఆవరణలో ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా, విశ్వకర్మ జయంతి సందర్భంగా రెండు మొక్కలను నాటారు.
సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలి
సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని బీజేపీ నాయకులు శుక్రవారం తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందించారు. అంతకుముందు ఎర్రాపహాడ్, ఎండ్రియాల్ గ్రామాల్లో తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు గంగారెడ్డి, వెంకట్రాంరెడ్డి, రవీందర్రావు, శ్యాంరావు, ఏనుగు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.