వైభవంగా కాల భైరవస్వామి జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST
ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల్లో వెలిసిన కాల భైరవస్వామి జన్మదిన వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు.
సదాశివనగర్, నవంబరు 27: ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల్లో వెలిసిన కాల భైరవస్వామి జన్మదిన వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం కామారెడ్డి నుంచి కాల భైరవస్వామి బంగారు విగ్రహాన్ని భారీ బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. వేదపండితులు, బ్రాహ్మణోత్తములు, ఆలయ పూజారులు స్వామి వారికి మంగళ స్నానాలు నిర్వహించి సింధూరంతో అలంకరించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఘనంగా తోట్లె ముస్తాబు చేసి బంగారు భైరవస్వామి విగ్రహాన్ని తోట్లెలో వేసి డోలారోహణం నిర్వహించారు. భక్తుల జయజయధ్వనుల మధ్య హారతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తుల కు ఆలయ సత్రంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్గుప్తా, ఈవో రవీంద ర్, సూపర్వైజర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.