సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి : బండా

ABN , First Publish Date - 2021-03-24T06:27:31+05:30 IST

రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి సూచించారు.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి : బండా

నల్లగొండ, మార్చి 23 : రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళాప్రాంగణంలో జీవ వైవిద్యం, సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. విపరీతమైన మందుల వాడకంతో పండించిన పంటలు మానవ మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. సేంద్రియ ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచి సాగు విస్తరించాలన్నారు. ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని, సేంద్రియ వ్యవసాయం చేసేవారిని గుర్తించి సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయనిదే పెద్దఎత్తున స్థానం కానుందన్నారు. జేడీఏ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వల్ల దిగుబడులు అధికంగా వచ్చినా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతారని కావున  సేంద్రియ ఎరువులను వాడాలని కోరారు. సదస్సులో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. సదస్సులో జీవవైవిధ్య కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ శిల్పిశర్మ, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవో జి.కాంతమ్మ, సంగీతలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:27:31+05:30 IST