పథకాల అమలులో పారదర్శకత పాటించాలి
ABN , First Publish Date - 2021-10-21T06:51:25+05:30 IST
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పథి
భువనగిరి రూరల్, అక్టోబరు 20: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. భువనగిరి మునిసిపల్ కార్యాలయంలో జిల్లా సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన, విద్యుత్, విద్య, మిషన్ భగీరథ, స్ర్తీశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, వైద్య,ఆరోగ్య, పౌరసరఫరాలు, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తున్న పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రా ల నిర్వహణ, పోషణ్ అభియాన్, పీఎం సడక్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్పై సమీక్షించారు. హెచ్ఎండీఏ నిధులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలకే కేటాయిస్తున్నారని వలిగొండ ఎంపీపీ నూతి రమేశ్, మాజీ మునిసిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ జడ్పీటీసీ ఎన్.పద్మ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి శ్రీనివాస్రెడ్డి, దీపక్తివారీ, డీఆర్డీవో మందడి ఉపేందర్రెడ్డి, భువనగిరి మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, అనాజీపురం సర్పంచ్ ఎదునూరి ప్రేమలత, అధికారులు పాల్గొన్నారు.
వాల్మీకి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
వాల్మీకి జీవితాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ వెంకట్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్, మునిసిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి యాదయ్య, ఏవో నాగేశ్వరచారి, డీఏవో అనురాధ, డీసీవో పర్మిలదేవి, డీఎంవో సబిత పాల్గొన్నారు.