సీఐ దంపతుల మృతితో విషాదఛాయలు

ABN , First Publish Date - 2021-05-09T04:31:54+05:30 IST

హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన సీఐ లక్ష్మణ్‌ ఝాన్సీ దంపతుల మరణవార్తతో గరిడేపల్లి మండలం కొండాయిగూడెం, అన్నారం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సీఐ దంపతుల మృతితో విషాదఛాయలు
సీఐ దంపతుల అంతిమయాత్ర,

గరిడేపల్లి రూరల్‌/ పెనపహాడ్‌, మే 8: హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన సీఐ లక్ష్మణ్‌ ఝాన్సీ దంపతుల మరణవార్తతో గరిడేపల్లి మండలం కొండాయిగూడెం, అన్నారం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్‌ స్వస్థలం పెనపహాడ్‌ మండలం నాగులపాటి అన్నారం కాగా గరిడేపల్లి మండలంలోని కొండాయిగూడెం గ్రామానికి చెందిన తూనం సత్యనారాయణ విజయ దంపతుల కుమార్తె ఝాన్సీతో 2011లో వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు. మే4న కొండాయిగూడెంలో జరిగిన బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్టకు లక్ష్మణ్‌, ఝాన్సీ దంపతులు రూ.1.40లక్షల విరాళం ఇచ్చారు. 6వ తేదీన గ్రామంలో ప్రతిష్ఠ కార్యక్రమానికి దంపతులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు గ్రామంలో ఉండి 7వ తేదీన స్వగ్రామం అన్నారం వెళ్లారు. 8వ తేదీ తెల్లవారు జామున ప్రమాదంలో దంపతులు మరణించిన వార్త విని గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

శనివారం డ్యూటీకి వెళ్లాలని...

స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి నాగులపాటి అన్నారంలో భోజనంచేశారు. శనివారం డ్యూటీకి వెళ్లాలని భార్య జాన్సీ, కుమారుడు కుశలవ్‌తో లక్ష్మణ్‌ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కుతూరు డాలీని అన్నారంలో నాయనమ్మ వద్ద ఉంచి వారు హైదరాబాద్‌కు బయలుదేరారు. వారు వెళ్లిన కొన్ని గంటలలోపే హైదరాబాద్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్‌, జాన్సీ, మృత్యువాతపడ్డారని, కుమారుడు కుశలవ్‌ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారని ఫోన ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం రావడంతో హతా శులయ్యారు. ప్రమాదఘటనతో రెండు గ్రామాల ప్రజలు దిగ్ర్భా ంతికి గురయ్యారు. అన్నారంలో లక్ష్మణ్‌, జాన్సీ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు, కోడలు మృత్యువాత పడటంతో గౌరమ్మ కన్నీరుమున్నీరైంది. పెనపహాడ్‌ ఎస్‌ఐ శ్రీకాంతగౌడ్‌ ఆమెను ఓదార్చారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

తల్లి, సోదరుడి ప్రోత్సాహంతో చదవి...

సీఐ లక్ష్మణ్‌ తండ్రి సుందరి భిక్షమయ్య 1999లో మరణిం చాడు. అప్పటి నుంచి తల్లి గౌరమ్మ, అన్న రామారావు ప్రోత్సా హంతో కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేశాడు. 2007లో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం పొంది సికింద్రాబాద్‌ పీఎస్‌లో విధులు నిర్వహించారు. 2009లో సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, చైతన్యపూరి, ఎల్‌బీనగర్‌ (ట్రాఫిక్‌) పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించారు. 2018లో అడిషనల్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌గా పదోన్నతి పొంది, ప్రస్తుతం సుల్తానబజార్‌ పీఎస్‌లో అడిషనల్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. 

Updated Date - 2021-05-09T04:31:54+05:30 IST