రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
ABN , First Publish Date - 2021-01-14T05:47:20+05:30 IST
రాష్ట్రంలో 2023లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఆలేరు రూరల్, జనవరి 13: రాష్ట్రంలో 2023లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో పోలీసుల దాడిలో గాయపడిన బీజేపీనేత పవన్కుమార్ శర్మను పరామర్శించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆలేరు మండలం కందిగడతండాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనగామలో జరిగిన ఘటనపై సీఎం 24 గంటల్లోగా స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. పవన్కుమార్పై దాడి చేసిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదని పోస్టింగ్లు, ప్రమోషన్లకోసం దాడులు చేయవద్దని సూచించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అవినీతి సీఎంతోపాటు అవినీతి అధికారులను కూడా వదిలిపెట్టబోమన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సీఎం తమ కార్యాలయంలో పెట్టుకొని వారిని కమీషన్ ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నారన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలలా తాము చేతకాని వారము కాదని, తమకిచ్చిన గిఫ్ట్లన్నింటినీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. సమావేశంలో బండ్రు శోభారాణి, ప్రేమేందర్రెడ్డి, నర్ల నర్సింగ్రావు, రాగవుల నరేందర్, రాఘవేందర్గౌడ్, జ్ఞాన్దీప్ పాల్గొన్నారు.