ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN , First Publish Date - 2021-07-24T06:50:28+05:30 IST
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పమేలాసత్పథి వైద్యులకు సూచించారు.
కలెక్టర్ పమేలాసత్పథి
జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
భువనగిరి రూరల్, జూలై 23: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పమేలాసత్పథి వైద్యులకు సూచించారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, కాన్పులవార్డు, చిన్నపిల్లల వార్డు, కొవిడ్ ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ఆసుపత్రిలో నీటి సరఫరా, పారిశుధ్య చర్యలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో తలుపులు, కిటికీలకు కర్టెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలను అధిగమించి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో వివరాల పట్టిక ఏర్పాటు చేసి డాక్టర్ల పేర్లు, మొబైల్ నెంబర్లు అందులో పొందుపర్చాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రకాశ్, ఆర్ఎంవో డాక్టర్ చందు, సిబ్బంది తదితరులు ఉన్నారు.