ఇది మా రోడ్డు... మీరు నడవొద్దు

ABN , First Publish Date - 2021-07-08T05:55:04+05:30 IST

ఈ రోడ్డు మా ఇంటి కోసమే వేశారు, మీరు ఈ రోడ్డు నుంచి నడవద్దు’ అని ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడి కుటు ంబం స్థానికుడిని బెదిరిస్తోంది.

ఇది మా రోడ్డు... మీరు నడవొద్దు
కృష్ణయ్య ఇంటి ఎదుట వేసిన కంప

 స్థానికుడిని బెదిరిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు

హుజూర్‌నగర్‌ రూరల్‌, జూలై 7: ‘ఈ రోడ్డు మా ఇంటి కోసమే వేశారు, మీరు ఈ రోడ్డు నుంచి నడవద్దు’ అని ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడి కుటు ంబం స్థానికుడిని బెదిరిస్తోంది. ఈ ఉదంతం హుజూర్‌నగర్‌లో వెలుగుచూసింది. విసుగెత్తిన బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మునిసిపల్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు మోదాల కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 28వ వార్డులోని మాధవరాయనిగూడెంలో నివసిస్తున్న కృష్ణయ్య ఇంటికి తూర్పు, పడమర వైపు మునిసిపల్‌ రోడ్లు ఉన్నాయి. వీటి గుండా కొన్నేళ్లుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల అదే వీధికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, విద్యా కమిటీ చైర్మన్‌ మోదాల సీతారాములు, అతడి కుటుంబ సభ్యులు కృష్ణయ్య ఇంటికి ఉన్న రెండు దారుల్లో తూర్పు వైపు ఉన్న రోడ్డు గుండానే రాకపోకలు సాగించాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట పడమర వైపు ఉన్న కృష్ణయ్య ఇంటి ద్వారం వద్ద కంప వేశారు. ఇదే విషయంపై కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, వచ్చి చూసి వెళ్లారే కానీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకుడి కుటుంబ సభ్యుల ఆగడాలు మితిమీరాయి. ఈ స్థలం మాది, ఈరోడ్డు మాకోసం వేసిందంటూ; మీరు నడవవద్దని కృష్ణయ్య కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో విసిగెత్తిన కృష్ణయ్య కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాధిత రైతు కృష్ణయ్యతో పాటు మోదాల సంజీవరావు, రాళ్లబండి రామారావు, మోదాల నర్సమ్మ, మోదాల శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T05:55:04+05:30 IST