విద్యార్థులందరూ మాస్కు తప్పనిసరిగా వాడాలి : డీఈవో
ABN , First Publish Date - 2021-02-05T06:00:14+05:30 IST
కొవిడ్ నిబంధనలు పాఠశాలల్లో కచ్చితంగా అమ లు చేస్తూ విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని డీఈవో భిక్షపతి సూచించారు.
గుర్రంపోడు / నాంపల్లి, ఫిబ్రవరి 4 : కొవిడ్ నిబంధనలు పాఠశాలల్లో కచ్చితంగా అమ లు చేస్తూ విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని డీఈవో భిక్షపతి సూచించారు. గురువారం ఆయన గుర్రంపోడు మండలంలోని తేనేపల్లి, పోచంపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో తరి రాములు, హెచ్ఎంలు నోముల యాదగిరి, పుష్పలత, గణేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో శానిటేషన్, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, విద్యార్థుల హాజరు శాతం, రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కరోనాపై విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని నిబంధనలు పాటిస్తుందన్నారు. పాఠశాలలో ప్రతిరోజూ శానిటేషన్ చేసి, విద్యార్థులు సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్ విజయశ్రీ పాల్గొన్నారు.